‘మీ కళ్లముందున్న మార్పును చూడండి. నేను చెప్పిన మాటల్లో వాస్తవం ఉందని నమ్మితే ఓట్లు వేసి మీ బిడ్డకు అండగా ఉండండి. మీ సూచనలు, సలహాలు ఇస్తే ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. తుగ్గులి, రాతన గ్రామాల ప్రజలతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలను వివరించారు. అలాగే లబ్ధిదారులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను, సూచనలు స్వీకరించారు.
జగన్ మాటల్లో.. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యాన్ని నెరవేర్చాం. ప్రతి 60 నుంచి 70 ఇళ్లకు వలంటీర్లను పెట్టాం. వారు సంక్షేమ పథకాలను నేరుగా అందజేస్తున్నారు. వ్యవస్థలో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్రజలు ఆలోచించాలి. 58 నెలల్లో ప్రతి గ్రామంలో ఓ సచివాలయం నిర్మించాం. రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థ ఆర్బీకే. మొట్టమొదటి సారిగా వ్యవసాయం మారింది. ఇప్పుడు ప్రతి ఎకరాకు ఈ – క్రాప్ చేసి ఉచితంగా పంట బీమా కల్పించాం.
మొట్టమొదటిసారిగా ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చాం. నాడు – నేడు తెచ్చాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చాం. ఆరో తరగతి ఆపైన క్లాస్ రూమ్ల్లో డిజిటల్ బోధన చేయిస్తున్నాం. కార్పొరేట్లు కూడా ప్రభుత్వ స్కూల్స్తో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అందరూ మార్పును గమనించాలని కోరుతున్నా. గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను తీసుకువచ్చి అనుసంధానం చేశాం. ఆరోగ్య సురక్ష ప్రతి ఆరు నెలలకో చేపట్టడంతో ఇంటింటినీ జల్లెడ పట్టి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి వెయ్యి ప్రొసీజర్ల నుంచి 3,300 వరకు పెంచాం. పరిధిని రూ.25 లక్షలకు పెంచాం.
చంద్రబాబు పాలనలో నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో పెన్షన్ ఎంతని అవ్వాతాతలను అడగాలి. మీ బిడ్డ హయాంలో ఎంతిస్తున్నారని అడగాలి. దేశంలోనే మనలా రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మరొకటి లేదు. పెన్షన్ల కోసం ఏటా రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే రెండో స్థానంలో ఉన్నా తెలంగాణ కేవలం రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఎక్కడ చూసినా పెన్షన్ రూ.500 మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం 66 లక్షల మందికి ఇస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో రూ.39 లక్షలు మందికే ఇచ్చారు. 66 లక్షల్లో 45 లక్షలు మంది అక్కచెల్లెమ్మలు, అవ్వలే ఉన్నారు. వ్యవసాయం, స్కూల్స్, వైద్యం అన్నీ గ్రామ పరిధిలో లంచాలు, వివక్ష లేకుండా సరికొత్తగా అందిస్తున్నాం. గతానికి భిన్నంగా ఇలాంటి మార్పులు, పరిస్థితులను తీసుకువచ్చాం. ఇవన్నీ కొనసాగడం చాలా అవసరం. ఈ ఎన్నికల్లో మీరు ఓటు వేసేది కేవలం ఓ ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేదాని కోసం కాదు. జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం కోసం ఓటు వేయాలని జగన్ కోరారు.