కృష్ణలంక ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకొని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబడింది. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధతో విజయవాడలో ప్రకాశం బ్యారేజ్ కి దిగువున ఉన్న కృష్ణలంక కాలనీలో ఉండే 80,000 మందికి ఈ రిటైనింగ్ వాల్ ద్వారా వరద ముంపు బాధ తప్పింది. కృష్ణా నదికి వచ్చే కొద్దిపాటి వరదకే బ్యారేజ్ నుంచే దిగువకు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి. బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేస్తున్నారంటే నగరంలోని కృష్ణలంక, రంజీత్ నగర్, కోటి నగర్ ,తారకరామా నగర్, భూపేష్ గుప్తా నగర్ ,పోలీస్ కాలనీ ,రామలింగేశ్వర నగర్ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. గతంలో మూడు లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఈ ప్రాంతాలన్నీ మునిగిపోయేవి, వర్షాకాలం మొదలవుగానే ఈ ప్రాంత ప్రజలంతా తమ సామాన్లతో పునరావాస కేంద్రాలకి తరలి పోవాల్సి వచ్చేది. ఎంతో ఆస్తి నష్టం జరిగేది.
ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం ద్వారా 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరును విడుదల చేసిన చుక్కనీరు కూడా ఇళ్లలోకి ప్రవేశించదు. 369.89 కోట్ల రూపాయల వ్యయంతో 2.26 కిలోమీటర్లు రక్షణ గోడని నిర్మించారు. అంతేకాకుండా ఈ రక్షణ గోడ వెంబడి 12.3 కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ ట్రాక్, మోడర్న్ ఎంట్రీ ప్లాజా , ఓపెన్ జిమ్, చిన్నారులు ఆట స్థలం, గ్రీనరీ తో సుందరంగా పార్కును ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసులకు మంచి సందర్శనీయ ప్రాంతంగా మారనుంది.
ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రిటైనింగ్ వాల్ గురించి గతంలో ఏ ప్రభుత్వము పట్టించుకోలేదని తనకి ఎవరు ప్రతిపాదించకపోయిన ఇక్కడ ప్రజలు పడుతున్న బాధను చూసి తాను చలించిపోయి ఎస్టిమేట్ లకి తానే పంపి, ఎస్టిమేట్లు పూర్తయిన తర్వాత డబ్బుని విడుదల చేసి అనుకున్న సమయం కంటే ముందే ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసామని తెలిపారు. ఇంకా కృష్ణా లంక ప్రాంత వాసులు తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని తెలిపారు. ఇప్పుడు 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిన ఈ ప్రాంత వాసులు భయపడాల్సిన పనిలేదు అని అన్నారు. రిటైనింగ్ వాల్ వెంబడే విజయవాడ ప్రాంత ప్రజల ఆహ్లాదంగా గడిపే దానికి అద్భుతంగా రివర్ వ్యూ పార్కుని తీర్చిదిద్దామని తెలిపారు.
ఇదే కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి శాశ్వత హక్కులతో పేదలకి ఇళ్ల పట్టాలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ సిఎస్ వై. శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీ రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, రూహుల్లా, కల్పలతా రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.