దేశ భవిష్యత్ తరగతి గదుల నుంచే మొదలవుతుంది. తెలుగుదేశం హయాంలో ఆరుబయట చదువులు ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో క్లాస్ రూమ్లు డిజిటల్ బాట పట్టాయి. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఈ తరహా విద్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో ఇప్పుడు పేద విద్యార్థులకు చేరువైంది. పాఠశాల స్థాయి నుంచే గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. ఫలితంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.
ఒకప్పుడు ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బ్లాక్ బోర్డుపై చాక్పీస్తో రాస్తూ బోధించేవారు. నేడు కాలం మారింది. పేద విద్యార్థులకు మంచి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో బ్లాక్ బోర్డు స్థానంలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ (ఐఎఫ్పీ) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. హైస్కూల్ స్థాయిలో ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62 వేల ఐఎఫ్పీలు పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలు, ఇంగ్లిష్ ల్యాబ్స్ ఏర్పాటు చేసింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతి తరగతి గదిలో ఒకటి చొప్పున ప్యానెల్ అమర్చారు. ఈ విధంగా ఒక్కో పాఠశాలలో ఐదు నుంచి 10 వరకు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు ఆధునిక సాంకేతిక విద్య అందుతోంది. గత ప్రభుత్వాల పాలనలో బడుల్లో టీవీ ఏర్పాటు చేయడమే గొప్పగా చెప్పుకున్న పరిస్థితి నుంచి ప్రస్తుతం ప్రపంచస్థాయిలో మేటి ఆధునిక విద్యాబోధనకు కేరాఫ్గా నిలిచిన ఐఎఫ్పీలను పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం టెక్నాలజీ విద్యను పేద వర్గాలకు అందుబాటులోకి తెచ్చింది.
ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడంతో ఉపాధ్యాయులు తాము పాఠ్య పుస్తకంలో చెబుతున్న పాఠ్యాంశాలను విద్యార్థులకు టచ్ స్క్రీన్ ద్వారా అక్కడికక్కడే ప్రత్యక్షంగా చూపించి, వారికి అర్థమయ్యే విధంగా వివరిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల వారీగా అన్ని పాఠ్యాంశాలను బోధించడంతోపాటు సందేహాలు నివృత్తి చేస్తున్నారు. ఎస్సీఈఆర్టీ వెబ్సైట్లోకి వెళ్లి పాఠ్యాంశాలపై వివరణ, ఇంకా యూట్యూబ్ ద్వారా వీడియోలను తిలకించే సదుపాయాలను కల్పించారు. తెరపై ప్రశ్నపత్రాలను ప్రదర్శించి సమాధానాలను రాయించడంతోపాటు డయాగ్రమ్స్ను గీసి సేవ్ చేసుకునే ఆప్షన్ పొందుపర్చడంతో ఉపాధ్యాయులకు బోధన సులభతరంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పల్లె, పట్టణం, నగరంలో ఎక్కడ చూసినా పాఠశాల అద్భుతంగా కనిపిస్తోంది. జగన్ ఇస్తున్న అవకాశాలను పిల్లలు అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు.