రోడ్డు ప్రమాదంలోఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఏలూరు నుంచి షేక్ సాబ్జీ కారులో భీమవరం వెళ్తున్న సమయంలో భీమవరం నుంచి ఆకివీడు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఎమ్మెల్సీ వాహనాన్ని ఢీ కొట్టడంతో షేక్ సాబ్జి అక్కడికక్కడే మృతి చెందగా ఆయన డ్రైవర్, గన్మెన్, పీఏ తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనలో గాయపడిన వారిని 108 అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఉండి ఏఎస్సై సూర్యనారాయణ ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. కాగా మంత్రివర్గ సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త తెలుసుకున్న సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. షేక్ సాబ్జీ మృతి పట్ల ఏపీ కేబినెట్ సభ్యులు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.