యువగళం పాదయాత్ర తర్వాత తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అడ్రస్ గల్లంతైంది. హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఫుల్ రెస్ట్ మోడ్లో ఉన్నారు. అందరూ ఎన్నికల హడావుడిలో పడి ఆయన్ను పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. ఏదో ఒక సాకుతో గ్యాప్ ఇచ్చి.. గ్యాప్ ఇచ్చి.. పాదయాత్రను మమ అనిపించిన చినబాబు మళ్లీ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వాస్తవానికి కొడుకు వల్ల పార్టీకి డ్యామేజీ ఎక్కువని భావించిన చంద్రబాబు నాయుడు ఇంటికే పరిమితం చేశారని ప్రచారం జరుగుతోంది.
అయితే సాక్షాత్తు జాతీయ ప్రధాన కార్యదర్శి కనిపించడం లేదని రాజకీయంగా విమర్శలు వస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో లోకేశ్ను బయటకు తెస్తున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి శంఖారావం పేరిట సభలు నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన వీడియోను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. పాదయాత్ర చేయని ప్రాంతాలను ఎంచుకున్నారు. రోజూ మూడు నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయన్నారు. 50 రోజులపాటు లోకేశ్ జనంలో తిరుగుతారని ప్రకటించారు. దీంతో తెలుగుదేశం నాయకుల్లో అప్పుడే భయం మొదలైంది. పాదయాత్ర సమయంలో ఆయన చేసిన ప్రసంగాలు అలాంటివి మరి. దీంతో అప్పట్లోనే చినబాబు యాత్ర మా ఊరిలో వద్దంటూ చాలామంది నాయకులు తెగేసి చెప్పారు. ఒకవేళ వచ్చినా దూరంగా ఉన్నారు.
2019లో చేసినట్లుగానే ఈసారి కూడా ఎన్నికల సభలను కామెడీ చేసేస్తాడని నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంత అధినేత కొడుకైనా సరే.. ఆయన వల్లే ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉందనేది వారి వాదన. పాదయాత్రంటే నడవలేక ఇబ్బంది పడిన లోకేశ్ ఇప్పుడు కారులో టూర్లు కాబట్టి తాను వెళ్తానని తండ్రిని పట్టుబడుతున్నారు. 11 నుంచి 50 రోజులపాటు చినబాబు కామెడీ ప్రసంగాలతో సోషల్ మీడియాకు పండగే ఇక. వెల్కమ్ బాబూ.. మీ మాటలతో జనాన్ని మంత్రముగ్దుల్ని చేస్తారో.. లేక టీడీపీ, జనసేన అభ్యర్థులను ముంచేస్తారో..