జగన్ను తిట్టాలి. ఆయన ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేయాలి. ఇదే తెలుగుదేశానికి తెలిసింది. ఈ క్రమంలో ఆ పార్టీ నాయకులు స్పష్టత లేకుండా ఇష్టమొచ్చింది మాట్లాడి అభాసుపాలవుతుంటారు. తాజాగా జూదంపై చంద్రబాబు ఒకలా.. ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మరోలా మాట్లాడి ప్రతి విషయంలో తమకు రెండు కళ్ల సిద్ధాంతాలు ఉంటాయని నిరూపించారు.
కోడిపందేలు ఆడటం, నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఇది ఒకరకమైన జూదమే. దీని వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ప్రభుత్వం నిషేధించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటుంటారు. జంతు హింస నేరం కాబట్టి ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారు. కాగామాణిక్యరావు ఇటీవల మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల పేరుతో జరిగే జూదాన్ని అడ్డుకోవాలన్నారు. దీనివల్ల కుటుంబాలు నాశనమవుతాయని మొసలి కన్నీరు కార్చారు. అంతటితో ఆగకుండా జూదాన్ని అరికట్టడంలో జగన్ విఫలమయ్యారని నోటికొచ్చింది మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులపై తప్పుడు ప్రచారానికి దిగారు. జనం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నించారు.
బాబు మాత్రం ఇలా..
కానీ జూదం విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మాటలు అధికార ప్రతినిధి వెర్షన్కు వేరేలా ఉన్నాయి. కోడిపందేలనే జూదానికి సెంటిమెంట్ రంగు పూశారు. ఇటీవల ఓ సందర్భంలో ఇలా బాబు మాట్లాడారు. ఇవి మన నాగరికత, సంస్కృతి, సంప్రదాయంలో ఓ భాగమన్నారు. తమిళనాడులో జల్లికట్టు బాగా చేస్తారని, చిత్తూరు జిల్లాలోనూ కొంతవరకు జరుగుతుందని, కానీ గోదావరి జిల్లాల ప్రత్యేకత కోడిపందేలన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు పోలీసులకు కోడిపందేలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని చెప్పినట్లు సభలో వెల్లడించారు. దీనిపై రాజీ పడకుండా ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. భావితరాలకు అందజేయాలని వాటిని ప్రోత్సహిస్తూ మాట్లాడారు.
కోర్టు ఆదేశించినా..
కోడిపందేల కట్టడికి చర్యలు తీసుకోవాలని ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. పందేలు నిర్వహించకుండా నిరోధించేలా అధికారులకు ఆదేశాలివ్వాలని కృష్ణా జిల్లాకు చెందిన హనుమ అయ్యప్ప అనే వ్యక్తి కోర్టులో పిల్ వేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం జంతు హింస నిరోధక చట్టం –1960, ఏపీ జూద నిరోధక చట్టం –1974 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే చంద్రబాబు మాత్రం పందేలు ఆడితే ఏం కాదంటూ ప్రోత్సహించారు. అవి మన సంస్కృతి, సంప్రదాయమంటూ జూదం తప్పు కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆయనంతే..
జూదం చాలా ప్రమాదకరం. దీని వల్ల ఎంతటి వారైనా నిట్టనిలువునా కూలిపోతారు. అందువల్ల ప్రభుత్వం ఎంతో కఠినంగా వ్యవహరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదు. కానీ బాబు మాత్రం ఓ వర్గం మెప్పు కోసం కోడిపందేలకు అనుకూలంగా మాట్లాడి.. తన పార్టీ అధికార ప్రతినిధి చేత జూదం అరికట్టండి అనిపించారు. నారా వారి గురించి తెలిసిందే కదా.. ప్రతి అంశంలో ఆయన రెండు కళ్ల సిద్ధాంతాన్ని వీడరు. మరో రెండు, మూడు రోజుల్లో కోడిపందేలు అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ ఆయన లేదా టీడీపీ నాయకులు స్టేట్మెంట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. వైఎస్సార్సీపీ నాయకులే దీనికి కారణం. అందుకే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదంటూ. ఏ విషయంలోనైనా వారికి జగన్ మాత్రమే టార్గెట్. అందుకు నరం లేని నాలుకతో ఏమైనా మాట్లాడుతారు.