టీడీపీ అధినేత చంద్రబాబు పెనుగొండలో ‘రా కదలిరా’ ముగింపు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎప్పటిలానే తనకే సాధ్యమైన అసత్యాలను పెనుగొండ సభలో వల్లెవేసిన చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు తీసుకురావడంపై అబద్దాలను అలవోకగా అల్లుకుంటూ పోయిన చంద్రబాబు పెనుగొండ సభలో ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు మాట్లాడిన మాటలు, అసలు వాస్తవాలను పరిశీలిస్తే కింది విధంగా ఉన్నాయి.
అనంతపురం అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన బాబు, విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనంతపురానికి ఇచ్చిన ప్రఖ్యాత ఎయిమ్స్ సంస్థను మంగళగిరికి తరలించి అనంతపురం ప్రజలకు తీరని ద్రోహం చేసాడు. అదేవిధంగా తిరుపతిలో పెడతానన్న HCL కి మోకాలడ్డి విజయవాడలో పెట్టించాడు.
రాయలసీమకు జగన్ ఏమి చేసాడు? నీళ్లు ఎవరు ఇచ్చారని కారుకూతలు కూస్తున్న బాబు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, తాజాగా సీఎం జగన్ పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లున్నాడు. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి హంద్రీ-నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ. 560 కోట్ల వ్యయంతో కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి సీఎం జగన్ నీళ్లు ఇచ్చిన సంగతి ప్రజలు మర్చిపోరు.
తన హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని ప్రజల చెవుల్లో పూలు పెట్టడం బాబుకే చెల్లింది. వాస్తవానికి చంద్రబాబు పాలనలో 2014 – 18 మధ్య రాష్ట్రంలోకి వచ్చి న పెట్టుబడులు రూ.32,803 కోట్లు కాగా జగన్ పాలనలో 2019 నుంచి 2023 జూన్ వరకు వచ్చి న పెట్టుబడులు -రూ.1,00,103 కోట్లు. దాదాపు చంద్రబాబు హయాం కంటే మూడు రెట్లు ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షించడంలో జగన్ ప్రభుత్వం సఫలీకృతమైంది. కొప్పర్తి పారిశ్రామిక సిటీ, శ్రీ సిటీలో అనేక పరిశ్రమలు రాగా శ్రీసిటీ మాత్రం ఏసీ హబ్ గా మారిపోయింది.
జగన్ ప్రభుత్వ పాలనలో రెండేళ్లు కరోనా వల్ల అడ్డంకులు ఏర్పడినా భారీ పెట్టుబడులను జగన్ సర్కారు ఆకర్షించింది. 2022లో రూ.45,217 కోట్ల పెట్టుబడులు తేవడం ద్వారా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని గత నెల ఫిభ్రవరి 29 న కేంద్ర వాణిజ్య శాఖ కి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇండ్రస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది.
తన పాలనలో ఐటి ఉద్యోగాలను కల్పించానని చెప్పుకొచ్చిన బాబు ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేసాడు. వాస్తవానికి బాబు హయాంలో 2014-19 మధ్య వచ్చిన ఐటీ ఉద్యోగాలు 24,350 కాగా జగన్ పాలనలో కరోనా వల్ల రెండు సంవత్సరాలు ఇబ్బంది పడినప్పటికీ 29,500 ఐటీ ఉద్యోగాల కల్పన జరిగింది. చంద్రబాబు పాలనలో కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించగా జగన్ పాలనలో 2.21 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది. జగన్ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు 16 లక్షలు వచ్చాయని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి రాజ్యసభలో డిసెంబర్ 21, 2023న ప్రకటించారు
1998 డిఎస్సీ -4,059
2008 డీఎస్సి -2,193
2018 డీఎస్సీ -6,954
2019 స్పెషల్ డీఎస్సి -602
కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు -1,200
2024 డీఎస్సీ -6,100
కాగా చంద్రబాబు నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. దానిని కూడా సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులు కోర్టుకు వెళ్లాల్సివచ్చింది. మొత్తానికి 2014-19 మధ్య బాబు హయాంలో 7,254 ఉపాధ్యాయ పోస్టులకు గాను చంద్రబాబు భర్తీ చేసిన పోస్టులు 300 మాత్రమే. వాస్తవాలు పైవిధంగా ఉంటే అబద్దాలను వల్లెవేస్తూ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టడం బాబుకే చెల్లింది.