తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి ముందు ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఉంది. అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు చారిత్రక అవసరమని ప్రజల్ని ఒప్పించడం. కానీ అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఆయన తనకు అవసరమైనప్పుడల్లా వారితో కలవడం.. తర్వాత విడిపోవడం.. వేరే వారితో చేరడం సర్వసాధారణమైపోయింది. దీంతో ప్రజలకు టీడీపీ నేతల మాటలపై నమ్మకం పోయింది.
ఎన్డీఏలో అయితే చేరేశాం.. సీట్లు తక్కువగానే ఇస్తున్నాం.. కానీ పొత్తును ప్రజలు అంగీకరించాలంటే ఏమి చేయాలని చంద్రబాబు అండ్ గ్యాంగ్ తర్జనభర్జన పడుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే సాకుతో బాబు 2018లో ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశారు. కమలం నేతల్ని ఇష్టామొచ్చినట్లు మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీని వ్యక్తిగతంగా తిట్టారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్తో జతకట్టారు. ఆయనకు శాస్వత శత్రువులు ఉండరు.. శాస్వత మిత్రులు ఉండరు కదా.. 24 ఎన్నికలు వచ్చేసరికి మళ్లీ బీజేపీతో చేరారు. తన స్వార్థం కోసం చేస్తున్న రాజకీయాలను ప్రజా ప్రయోజనాల కోసమని ఎలా చూపించాలనే అంశంపై ప్రస్తుతం తీవ్రంగా యోచిస్తున్నారు. ఎల్లో మీడియా ద్వారానే ఇది సాధ్యమని నిర్ణయించి సరికొత్త ప్రచారానికి తెరలేపారు.
కేంద్రం ఏపీకి చేసిందని శూన్యమని 19 ఎన్నికల వరకు ఊదరగొట్టిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు స్వరం మార్చారు. బుధవారం ఓ సమావేశంలో బాబు మాట్లాడుతూ రాష్ట్ర హితం, భవిష్యత్ కోసమే పొత్తు పెట్టుకున్నామన్నారు. తమ కోసం కాదని చెప్పారు. ప్రజలు గెలవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. ప్రత్యేక హోదా విషయంలోనే పట్టుబట్టాం. అంతే తప్ప బీజేపీతో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు. ఆరోజు తాన విభేదించకుండా ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో చాలా ముందుకు వెళ్లేదని అభిప్రాయపడ్డారు. కాషాయ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా మాటలు మారుస్తున్నారు.
వాస్తవానికి బాబు ఇప్పుడు నటిస్తున్నారు. గతంలో ఎన్డీఏ నుంచి విడిపోయినప్పుడు మోదీకి కుటుంబం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని తిట్టి పోశారు. అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని అసెంబ్లీలో ప్రకటించారు. ఇప్పుడు పొత్తు పొడవగానే టీడీపీ నాయకులంతా కమలం పార్టీని, మోదీని తెగ పొగిడేస్తున్నారు. 2014–19 మధ్య బాబు కోరిక మేరకు కేంద్రం నిధులు వరదలా పారించిందని డబ్బా కొడుతున్నారు. ఓ వైపు హోదా కోసం తప్పలేదంటున్నారు. పోనీ అది ఇచ్చారంటే లేదు కదా. జనం మైండ్సెట్ను మార్చేందుకు బాబు సూచనలతో ఎల్లో మీడియా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది. అందరూ కలిసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బూచిగా చూపుతున్నారు. ఐదేళ్లలో ఏమీ చేయని వారితో ఇప్పుడెందుకు కలుస్తున్నారంటే జగన్ వల్ల అభివృద్ధి ఆగిపోయిందంట. మళ్లీ రాష్ట్రం గాడిలో పడాలంటే కేంద్ర సహకారం కావాలంట. అంతేలే.. చంద్రబాబు కోరుకుంటే దాని పేరు రాష్ట్రానికి చారిత్రక అవసరం.. వద్దు అనుకుంటే అది చారిత్రక తప్పిదం. దశాబ్దాలుగా ఇదే కదా జరుగుతోంది.