జగన్ పాలనలో సంక్షేమం సర్వనాశనం: బాబు ఇచ్చిందే ఎక్కువ - టీడీపీ బాకా పత్రిక చైతన్య రథం…
గత నాలుగేళ్లగా జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుంది, వెనుజులా అవుతుంది అని ప్రచారం చేసి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాం అనీ, మా నోటికాడి కూడును లాగేసుకోవాలని చూస్తున్నారని ప్రజలు బావిస్తున్నారని అర్థం అయ్యాక టీడీపీ కొత్త రాగం అందుకుంది. జగన్ తెచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం, ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాం అని ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు…
ఇప్పుడు ఇంకో మెట్టు ఎక్కి జగన్ పాలనలో అసలు సంక్షేమం నాశనం అయిందని తమ గత పాలనలో ఎంతో గొప్పగా సంక్షేమం అందించామని చెప్పుకుంటున్నారు..
కమ్యూనిటీ హాల్లు, కార్పొరేషన్ భవనాల నిర్మాణం కూడా సంక్షేమం అంట.. హజ్ హౌస్ లు, షాధీఖానల శంకుస్థాపన చేసి వాటినీ పూర్తి చేయకుండా పూర్తి చేసాం అనీ వాటిని కూడా సంక్షేమం కిందే లెక్కగట్టారు… ఆశ్చర్యం ఏంటంటే , అంచనా వ్యయాలను చూపుతూ వాటిని ఖర్చు చేసినట్లుగా లెక్కగట్టడం…..
నాడు – నేడు ని ఎలా కౌంటర్ చేయాలో తెలియక, బాబు బడుగు బలహీన వర్గాల పిల్లలని కార్పోరేట్ స్కూళ్లలో చదివించాడనీ, దాన్ని జగన్ రద్దు చేసి కోర్టులో చివాట్లు తిన్నాడనీ రాసుకొచ్చారు… బాబు చదివించిన ప్రపంచస్తాయి కార్పోరేట్ స్కూల్స్ ఎక్కడున్నాయో? వాటిలో ప్రభుత్వం ద్వారా చదివించింది ఎంతమందినో? వారు ఎవరో ? ఇలాంటి లెక్కలేం లేవు… బాబు హయాంలో పేద పిల్లలని కార్పొరేట్ స్కూల్స్ లో ఉచితంగా చదివించడానికి ఉద్దేశించిన పథకం పేరేమిటో కనీసం నారా చంద్ర బాబు నాయుడు గారికైనా తెలుసా?
స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించారట…
ఆ స్కిల్ డెవలప్మెంట్ లో ఏ మాత్రం శిక్షణ ఇచ్చారో? ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారో? చంద్ర బాబు గారు కోర్టుకు విన్నవిస్తే బాగుండు, అందులో జరిగిన అవినీతి మీద విచారణ జరుగుతుంది అనే విషయాన్ని చైతన్య రథం మరచినట్లుంది…
దళిత గిరిజనులకు 3000 పైగా ఎకరాలు కొని ఇచ్చారట….
1995 లో ఎన్టీఆర్ నుండి బాబు సీటు లాక్కునే సమయానికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు 8 లక్షల ఎకరాలు భూసంస్కరణ చట్టాల ద్వారా మిగులు భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంచడానికి సిద్ధంగా ఉండగా, తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ఎకరం కూడా పేదలకు పంచిన పాపాన పోలేదు, వైయస్సార్ సీఎం అయ్యాక 3.5 ఏళ్లలోనే 4.5 లక్షల ఎకరాలను పేదలు పంచిన చరిత్ర ఉంది.. ప్రభుత్వం వద్ద ఖాళీగా పడి ఉన్న 8 లక్షల ఎకరాలలో 8 వేల ఎకరాలు పంచడానికి కూడా మనసు రాని బాబు గారట, 3000 ఎకరాలు కొని పంచాడట… ఇలా చెప్పుకోకపోయినా మర్యాద మిగుల్తుంది కదా?
ఇక 5 వేలకు పైగా ఇన్నోవాలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అందించారట…..
కాకపోతే అవేవీ బయట మనకు కనపడవు, ఎందుకంటే ఇచ్చిన నాలుగు ఇన్నోవాలు కూడా తమ వారికే కదా ఇచ్చుకుంది.. దళితుల పేరు చెప్పి తనవారికే ప్రభుత్వ సొమ్ముతో వాహనాలు కట్టబెట్టారు… పార్టీ లతో సంబంధం లేకుండా నిజమైన అర్హులకి ఒక్కరికంటే ఒక్కరికి ఇన్నోవా కారు సబ్సిడీ లో అందజేయకుండా దళితుల పేరిట ఇన్నోవాలు, ట్రాక్టర్లు అయిన వారికి కట్టబెట్టి వారు లోన్లు కట్టకుండా ఎగవేయడంతో బ్యాంకులు ఆ రుణాలన్నిటిని నిరర్ధక పద్దులుగా దళితుల ఖాతాల్లో చూపించడంతో వారికి భవిష్యత్తులో ఏ బ్యాంకు అప్పు ఇవ్వని దుస్థితిలోకి నెట్టేశారు బాబు గారు.
ఇలా ఒకటా రెండా ప్రతీ లైన్ లోనూ అబద్దాలే, తాను కూడా సంక్షేమం అందించానని చెప్పుకోవటానికి చంద్రన్న కిస్మిస్ కానుక, సంక్రాంతి కానుక తప్ప మరేమి కానరాకపోవడంతో, ఉపాధి హామీ పథకం ద్వారా, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద వేసిన రోడ్లు కూడా తమ ప్రభుత్వ సంక్షేమమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, కాకపోతే గణాంకాలు చూస్తే బాబు హయాం లో కన్నా, 2019 నుండి ఇప్పటి వరకు వేసిన రోడ్లే ఎక్కువ..
ఇక బ్యాంక్ లు ఇచ్చిన రుణాలు కూడా ప్రభుత్వ సంక్షేమం లెక్కలోకి వేసుకోడం చూస్తే ఒకింత ఆశ్చర్యం కలగక మానదు…
2014 ఎన్నికల మేనిఫెస్టో లో నిరుద్యోగభృతి హామీ ఇచ్చి.. 2018 వరకు దాని ఊసే ఎత్తకుండా, 2018 లో ధరఖాస్తులు చేసుకోమనగా, మొత్తంగా 2018 లో 45 లక్షల మంది ధరఖాస్తు చేసుకోగా, అందులో 12 లక్షల మందికి ఇస్తాం అని ప్రకటించి చివరికి కేవలం లక్ష ఎనభై వేల మందికి అది కూడా ఇస్తాం అన్న 2 వేలు కాకుండా వెయ్యి మాత్రమే ఇస్తూ, దిగిపోయేనాటికి మొత్తంగా మూడు లక్షల ఇరవై వేల మందికి మాత్రమే కేవలం నాలుగు నెలలే ఇచ్చి 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చామని రాసుకున్నారు…
ఆఖరికి టీడీపీ పరిస్థితి ఎలా అయ్యింది అంటే, తాము చేసిన సంక్షేమం ఏమిటని వారే వెతుక్కుంటే పట్టుమని పది మంచి కార్యక్రమాలు కూడా వారి లెక్కలకి దొరకడం లేదు.. అందినకాడికి దోచుకోవడం, పథకాల పేరుతో తమ వారి జేబులు నింపడం తప్ప, పేద ప్రజల సంక్షేమం అంటే ఏమిటో నిర్వచనం కూడా తెలియకుండా, బ్యాంకు లు ఇచ్చే రుణాలు, రోడ్లు, భవనాలు వంటి మౌళిక సదుపాయాలను సంక్షేమం అని భావిస్తున్నారు.. అధికారం లో ఉన్నప్పుడు ఎప్పుడైనా పేదల సంక్షేమం గూర్చి ఆలోచిస్తే కదా, అధికారం లేనప్పుడు చెప్పుకోగలగడానికి?. చివరికి టీడీపీ పత్రిక దగ్గర కూడా బాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్కటంటే ఒక్క పథకం కూడా బదులు లేకపోయింది… హతవిధీ….