టికెట్ల కేటాయింపులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణి ప్రదర్శించారు. దీంతో తెలుగు తమ్ముళ్లు అవాక్కవుతున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారి విషయంలో రూల్స్ పెట్టిన బాబు కొందరి విషయంలో మాత్రం బ్రేక్ చేశారు.
ఈసారి కూడా గెలిచే పరిస్థితి లేదని నారా వారు జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. అయినా కాదనలేని పరిస్థితి. కుటుంబానికి ఒక టికెట్ ఇస్తామని, పొత్తు నేపథ్యంలో త్యాగాలు చేయాలని సీనియర్లకు బాబు చెప్పారు. కానీ కేటాయింపులు చూశాక టీడీపీ పెద్ద చెప్పినవి అబద్ధాలేనని తేలిపోయింది. తనకు కావాల్సిన వారికి అడిగినన్ని టికెట్లు ఇచ్చారు. దూరం పెట్టాలనుకున్న వారిని ఒక స్థానానికే పరిమితం చేశారు.
ఒకప్పుడు పరిటాల రవి అనంతపురం జిల్లాలో టీడీపీని శాసించారు. ఆయన మాటల్ని చంద్రబాబు కూడా కాదనలేని పరిస్థితి ఉండేది. నేడు ఆ కుటుంబం టికెట్ల కోసం టీడీపీ అధినేత చుట్టూ తిరగాల్సి వస్తోంది. సునీతకు రాప్తాడులో అవకాశం ఇచ్చారు. ఆమె కొడుకు శ్రీరామ్కు ధర్మవరం సీటు ఇవ్వనని తెగేసి చెప్పారు. వెంకయ్య నాయుడి ఒత్తిడికి తలొగ్గి ఆయన శిష్యుడు సత్యకు చాన్స్ ఇస్తున్నట్లు తెలిసింది. చింతకాయల అయ్యన్న పాత్రుడు చాలా సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి. తన కొడుడు విజయ్కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించాలని శతవిధాలా ప్రయత్నించారు. మొదటి నుంచి కష్టపడుతున్నాం కాబట్టి తమకే దక్కాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒకరికే అవకాశమని చెప్పిన బాబు అయ్యన్నకు నర్సీపట్నం అసెంబ్లీతో సరిపెట్టారు. అనకాపల్లిని ఎంపీని తన సన్నిహితుడైన సీఎం రమేష్కు బీజేపీ కోటాలో ఇస్తున్నారు. జేసీ బ్రదర్స్ కుటుంబంలో అస్మిత్రెడ్డికి తాడిపత్రి సీటు ఇచ్చారు. జేసీ దివాకర్రెడ్డి, ప్రభాకర్రెడ్డికి నో చెప్పేశారు.
కాయిన్కు మరోవైపు చూస్తే.. చంద్రబాబు కుటుంబంలో నలుగురు పోటీలో ఉన్నారు. బాబు కుప్పం, లోకేశ్ మంగళగిరిలో, ఈయన మామ బాలకృష్ణ హిందూపురంలో, ఈయన చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. యనమల రామకృష్ణుడు ఫ్యామిలీకి టీడీపీ అధినేత పెద్దపీట వేశారు. ఆయన కూతురు దివ్యకు తుని, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్కు మైదుకూరు, యనమల అల్లుడు మహేష్ యాదవ్కు ఏలూరు ఎంపీ సీట్లు కట్టబెట్టారు. కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి అసెంబ్లీ నుంచి, అదే కుటుంబంలోని రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తున్నారు. రామ్మోహన్ సోదరి భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ నుంచి బరిలో ఉన్నారు. ఇక నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పార్లమెంట్కు, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి కోవూరు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇందుకోసం బాబు భారీగానే వసూలు చేశారు.
పాపం కొన్ని కుటుంబాలు మాత్రమే త్యాగాలు చేయాల్సి వచ్చింది. బాబుకు కావాల్సిన వారు మాత్రం ఎంచక్కా టికెట్లు తీసుకున్నారు. ఇదెక్కడి న్యాయమని ఎవరైనా అడిగితే రాష్ట్రం కోసం తప్పదని కూల్గా చెబుతారు నారా వారు.