షాను బతిమిలాడి.. బయటికొచ్చి బిల్డప్పా..
‘గతం గతః అన్నీ మరచి కలిసి సాగుదాం. అభివృద్ధి, సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడాల్లేవు. దక్షిణాన ఎన్డీఏ బలోపేతానికి సహకరించండి. ఏపీ అభివృద్ధికి మద్దతు ఇస్తాం’.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిశాక ఆంధ్రజ్యోతి రాసిన రాతలివి. అదే సమయంలో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోందని బాబు తమ నేతలతో అన్నారని తెలిపింది. ఇదంతా శుద్ధ అబద్ధమని ఎల్లో మీడియా కల్పితమని ప్రచారం జరుగుతోంది.
‘తప్పని పరిస్థితుల్లో మీకు దూరయ్యాను. మీపై నాకు∙ఎలాంటి ద్వేషం లేదు. ఎన్డీఏలో చేరుతా. దయచేసి నన్ను తీసుకోండి’ షాకు బాబు చెప్పిన మాటలివి. ఓ ఆంగ్ల మీడియాకు బీజేపీ అధిష్టానానికి చెందిన ప్రముఖ వ్యక్తి ఇచ్చిన సమాచారం అంటూ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంకా సీట్ల విషయంలో బీజేపీ షరతులు విధించిందని అందుకు టీడీపీ అధినేత ఒప్పుకున్నారని అందులో ఉంది.
సదరు నేత సమాచారం ప్రకారం బీజేపీ, జనసేన ఇద్దరికి కలిపి 30 అసెంబ్లీ, 10 పార్లమెంట్ సీట్లను బాబు ఇస్తానన్నారు. ఇందులో కమలం పార్టీకి 5 నుంచి 10 మిగతావి జనసేనకు. అయితే దీనికి షా ఒప్పుకోలేదని, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో నాలుగు టీడీపీ, రెండు జనసేన, ఒకటి బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేశారట. పార్లమెంట్ విషయానికొస్తే బీజేపీకి 7 నుంచి 8, జనసేనకు 1 నుంచి 3 వరకు ఇస్తామని చంద్రబాబు చెప్పారట. దీనిపై కూడా అంగీకారం లేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాషాయ పార్టీ కొన్ని ఎంపీ స్థానాలపై పట్టువీడటం లేదని తెలిసింది. విశాఖలో జీవీఎల్, రాజమండ్రిలో పురందేశ్వరి, నర్సాపురంలో∙రఘురామరాజు, రాజంపేటలో కిరణ్కుమార్రెడ్డి, అనంతపురం లేదా హిందూపురం నుంచి సత్యకుమార్ను పోటీ చేయించేందుకు సీట్లు అడిగిందని తెలిసింది. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
త్యాగాలు చేయండి
శుక్రవారం చంద్రబాబు ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి మన వాళ్లు త్యాగాలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. బాబుకు ఈ ఎన్నికలు చాలా కీలకం. దీంతో బీజేపీ పెట్టిన షరతులకు ఒప్పుకొన్నారని, వారికి సీట్లు అధికంగా కేటాయించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. అందువల్ల టికెట్లు అడుగుతున్న తెలుగు తమ్ముళ్లను బుజ్జగించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ చాలామంది నేతలు ఇందుకు అంగీకరించడం లేదు. టికెట్లు కావాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం నారా వారి టైం చాలా బ్యాడ్గా నడుస్తోంది. ఎన్డీఏలోకి రావాలని కమలం పెద్దలే పిలిచారని ఎల్లో మీడియాలో ప్రచారం చేయిస్తుంటే ఎవరూ నమ్మడం లేదు. టికెట్లు ఎక్కువ ఇస్తే నష్టపోతామని భయం ఉంది. మరోవైపు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య ఏ మాత్రం పొసగడం లేదు. ప్రతి సభలో గొడవలు జరుగుతున్నాయి. సజావుగా పొత్తులు కుదుర్చుకుని ఎన్నికల వెళ్లడం.. కుర్చీ మడత పెట్టేస్తానని చెప్పినంత ఈజీ కాదని బాబుకు బాగా అవగతమైంది. ఆయన పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు గానీ.. లోపల భయం టన్నుల్లో ఉంది.