తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని నమ్మి మోసపోయామని ఆ పార్టీ నేతలు మెల్లగా గ్రహిస్తున్నారు. మొదటి నుంచి కష్టపడిన చాలామందికి టీడీపీ అధిష్టానం టికెట్లు ఎగ్గొట్టింది. అలాగే అవకాశాలు కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారు ఇప్పుడు తాము చేసిన తప్పును తెలుసుకుంటున్నారు.
‘ప్రస్తుత రాజకీయాలు – లాయల్టీ, కమిట్మెంట్, హానెస్ట్కి విలువ లేకుండా పోతున్నాయి’ ఇది టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన ట్వీట్. ఆమె కుటుంబం మొదటి నుంచి టీడీపీలో ఉంది. 2004లో ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో చింతలపూడి నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రి కూడా పనిచేశారు. 2019లో టికెట్ రాకపోయినా పార్టీని వీడలేదు. 2024లో చింతలపూడి సీటు ఆశించి పనిచేసుకుంటూ వెళ్లారు. అయితే బాబు సొంగా రోషన్ కుమార్ అనే వ్యక్తికి కట్టబెట్టారు. దీంతో ఆమె ఆవేదన చెంది వీడియో మెసేజ్ కూడా విడుదల చేశారు. తనకు ఎక్కడో ఒక చోట అవకాశం ఇవ్వాలని బాబును విజ్ఞప్తి చేశారు. అయితే అధిష్టానం కనికరించలేదు. ఈ సీనియర్ దళిత నాయకురాలికి వెన్నుపోటు పొడవడంతో కళ్లు తెరుచుకుని ట్వీట్ చేశారు. పాలిటిక్స్లో నీతి, నిజాయతీకి విలువ లేకుండా పోయిందని బాధపడ్డారు.
ఇక ఉండవల్లి శ్రీదేవి.. ఈమె వైఎస్ జగన్మోహన్రెడ్డిని నమ్మితే తాడికొండ ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత చంద్రబాబును నమ్ముకుని భవిష్యత్ను సమాధి చేసుకుంది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈ అర్థమైంది’ అని ట్వీట్ చేశారు. అందులో కత్తి ఈమెజీ పెట్టడం గమనార్హం. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో టీడీపీకి అమ్ముడుపోయి శ్రీదేవి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. దీంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. కొంతకాలం చంద్రబాబు, లోకేశ్ల భజన చేశారు. తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారని సంబరపడిపోయారు. కానీ బాబు మార్క్ వెన్నుపోటు చూడ్డానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆ సీటును తెనాలి శ్రావణ్ కుమార్కు ఇచ్చారు. ఇక శ్రీదేవి బాపట్ల ఎంపీపై ఆశ పెట్టుకున్నారు. ఆ సీటును తెన్నేటి కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి శుక్రవారం ప్రకటించారు. దీంతో ఉండవల్లి శ్రీదేవి రాజకీయ భవిష్యత్కు ఎండ్ కార్డ్ పడినట్లయ్యింది.
చంద్రబాబు వెన్నుపోటుకు బలైన వారు ఎందరో ఉన్నారు. రాజకీయంగా అవకాశాలు ఇస్తానని వాడుకుని వదిలేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను మోసం చేయడంలో ఆయన దిట్ట. ఇప్పుడు ఇద్దరు దళిత మహిళలకు బాబు విషయంలో మబ్బులు వీడిపోయాయి. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది.