చెప్పేది కొండంత, చేసేది గోరంత అన్న బాబు వైఖరినే, ఆయన సతీమణి భువనేశ్వరి గారు కూడా అనుసరిస్తున్నారు. ఎప్పుడో విప్లవాత్మకంగా యన్టీఆర్ ప్రవేశపెట్టిన కేజీ రెండు రూపాయల బియ్యంతో… బాబు తూతూ మంత్రంగా మొదలుపెట్టిన అన్నా క్యాంటీన్లను పోలుస్తూ.. తండ్రిని మించిన యుగపురుషుడిగా భర్తను చూపించడానికి తాపత్రయపడుతున్నారు.
“పేదవాడికి మూడుపూటలా తక్కువ ఖర్చుతో అన్నం దొరకాలనే ఉద్దేశంతో చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టారని, వాటిని జగన్ మూసివేయించినా టీడీపీ కార్యకర్తలు పెద్దమనసుతో నడిపిస్తున్నారని…” కుప్పం నిజం గెలవాలి యాత్ర సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే నిజం గెలవాలి అంటూ ఆవిడ చేస్తున్న యాత్రలో ఇలా నిజాన్ని మరుగున పడేసే స్టేట్మెంట్లు ఇవ్వడమే కడు బాధాకరం.
టీడీపీ అతి గొప్పగా 2014 లోనే అన్నా క్యాంటీన్లను ప్రవేశపెడతామని చెప్పి, గెలిచిన తర్వాత ప్రభుత్వ ఖర్చులతో టీడీపీ మంత్రులు, అధికారులు తమిళనాడు అమ్మ కాంటీన్ల పరిశీలన అంటూ కోట్లు తగలేశారు. ఆ పిమ్మట చంద్రబాబుకి అలవాటు అయిన నాన్చివేత ధోరణిలో ఆ ప్రతిపాదన ఆటకెక్కించారు . 2018 లో ఎన్నికలకు ముందు హడావిడిగా 46 క్యాంటీన్లను ప్రారంభించేసి ఇహ రాష్ట్రం మొత్తం తాము పెట్టే అన్నమే తింటున్నట్టు భారీ ప్రకటనలు ఇచ్చారు. చివరికి 2019 నాటికి 180 అన్నా కాంటీన్లతో రోజుకి 63000 మందికి సర్వీస్ చేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేదలందరి ఆకలి తీరుస్తున్నట్టు, పచ్చ మీడియాలో పచ్చి అబద్ధాలతో ప్రసారాలు కూడా చేయించుకున్నారు.
నిజానికి అన్నా క్యాంటీన్ల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేసినట్టు చూపించి అవినీతికి పాల్పడి ఒక్కో కాంటీన్ నిర్మాణంలో 25 లక్షల చొప్పున మింగేసారు టీడీపీ నేతలు. ఇన్ని నిజాలు దాచిపెట్టి ప్రస్తుత ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టారు అని జగన్ ని ఆడిపోసుకుంటున్న భువనేశ్వరి గారికి తెలియాల్సింది ఏంటంటే… ఈ ప్రభుత్వంలో సన్న బియ్యం పేదవాడి ఇంటి గడప ముందుకు వస్తుంది. నిత్యావసరాలు, మహిళలకు ఆసరాలు, జీవనోపాధికై రకరకాల సబ్సిడీ లోన్లు అంటూ ఎన్నో సంక్షేమ పధకాలు పేదవాడి ఇంటి ముందుకు వచ్చి నిలుచుంటుంటే… పెత్తందారీకి అలవాటు పడిన నారా కుటుంబం వారు మాత్రం ఇంకా పేదవాడిని కంచం పట్టుకుని రోడ్డుమీద నిలబెట్టడమే అసలైన సంక్షేమమన్నట్టు భావిస్తున్నారు. కేవలం ఎన్నికల ముందు ఆరు నెలలు నడిపిన అన్నా క్యాంటీన్లను నాలుగేళ్ళుగా వదలకుండా… ఓట్లు దండుకోవడానికి ఈ టీడీపీ వాళ్ళు ఇంకా ఉపయోగించుకుంటూనే ఉన్నారు.