చంద్రబాబు పన్నిన కుట్రలో చిక్కుకుని సీఎం జగన్ సోదరి షర్మిల పావుగా మారారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ఆదివారం వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ షర్మిల వ్యవహరిస్తున్న తీరుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ అన్ని పార్టీలను పొత్తులతో కలుపుకుంటూ కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లను కొల్లగొట్టే చంద్రబాబు ఆఖరికి వైఎస్సార్ కుటుంబంలో చిచ్చుబెట్టి ఓట్లను తనవైపు మళ్లించుకునే కుటిలయత్నానికి తెరతీశారు. షర్మిల చీల్చాలనుకున్న ప్రతి ఓటు వైఎస్సార్ శత్రువుగా ఉన్న చంద్రబాబుకు వేస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోకపోవడం బాధాకరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులంతా షర్మిలను అక్కగాచెల్లిగా భావిస్తున్నారు. కానీ షర్మిల చంద్రబాబు చేతిలో పావుగా మారి చేస్తున్న రాజకీయాలు చూసి అందరూ ఆవేదన చెందుతున్నారు. రాజకీయాలలో అధికారం కోసం, ఎవరికో మేలు చేకూర్చడం కోసం తప్పుచేస్తే చరిత్ర మరిచిపోదు. ఈ తప్పు షర్మిలమ్మ సరిదిద్దుకోక పోతే చరిత్రలో నిలిచిపోతారు.
మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్ ని అధికారంలోకి రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇలాంటి కుట్రలను బద్దలు చేసి ఎస్సీఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం కల్పించిన జగనన్నకు సంపూర్ణ మద్దతును ఇచ్చి మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుందని, తనకు ఓట్లు వేస్తె రాష్ట్రాన్ని రాసిస్తానని చెప్పే చంద్రబాబు మోసపు మాటలు ఏ ఒక్కరు నమ్మొదని అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. కాగా ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజద్భాషా, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, దక్షిణ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి, వైఎస్సార్ పార్టీ జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నెల్లూరు మేయర్ స్రవంతి, నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక పాల్గొన్నారు.