చంద్రబాబు నాయుడికి పలురకాలుగా జాకీలు వేస్తూ… సర్వశక్తిమంతుడిగా, శుధ్ధ నీతివంతుడిగా చిత్రీకరించడమే లక్ష్యంగా రాసే రాధాకృష్ణ వీకెండ్ కమెంట్ కొత్త పలుకు లో ఈ వారం నిజంగానే కొత్త పలుకులు చేరాయి. “అవమానకరమే అయినా …బీజేపీ తో పొత్తు ఎందుకంటే …? టీడీపీ జనసేన కూటమి బలహీనంగా ఉంది” అంటూ రాసిన ఈ సంపాదకీయంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి ఎన్ని విధాలా లాభమో చెప్పారు. బైబిల్లో చెప్పిన్నట్టు “తనని తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడతాడు” చందాన టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకున్న రాధాకృష్ణ టీడీపీ బలహీనంగా ఉంది అంటూ సెంటిమెంటు పూస్తున్నారు.
నిజానికి ఓట్లపరంగా బీజేపీతో కలవడం వల్ల తెలుగుదేశం–జనసేన కూటమికి కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదనీ, జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ బలీయమైన శక్తిగా ఆవిర్భవించిందనీ,
ప్రధాని మోదీని ఢీకొనే సత్తా ఉన్న నాయకుడు కనిపించడం లేదనీ ఆయన అభిప్రాయపడ్డారు. బలమైన శక్తిగా ఏర్పడ్డ బీజేపీతో కలిసినా ఆంధ్రలో ఓట్లపరంగా ప్రయోజనం ఉండదని ఎందుకంటున్నారో మాత్రం చెప్పట్లేదు.
కాంగ్రెస్ పార్టీ బలహీనపడిపోవడంతో ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ప్రధాని మోదీ రాజకీయాన్ని ఎదిరించి నిలబడలేక పోతున్నాయనీ, ఈ క్రమంలో తనతో పొత్తు పెట్టుకోవడానికి ఉత్సుకత ప్రదర్శిస్తున్న ప్రాంతీయ పార్టీల మెడలు వంచి అధిక సంఖ్యలో సీట్లు పొందాలని బీజేపీ భావిస్తుందనీ, ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను దారిలోకి తెచ్చుకున్నారనీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం–జనసేన కూటమి కూడా అదే దారిలో ఉందనీ ఆయన అభిప్రాయపడ్డారు. మరి ఇదే రాధాకృష్ణ అండ్ బ్యాచ్ వైసీపీని మాత్రం కేంద్రం మెడలు వంచలేకపోతుందనీ, కేసుల్లో బెయిలు కోసమే బీజేపీకి తలొగ్గి ఉంటున్నారనీ గతంలో పదేపదే రాసింది.
కమలనాథులను సంతృప్తి పరచడం కోసం ఆరేడు లోక్సభ సీట్లు ఇవ్వడానికి కూడా చంద్రబాబు సిద్ధపడుతున్నారు. పొత్తులకు సంబంధించి ప్రాథమికంగా అవగాహన కుదిరినప్పటికీ తుది దశ చర్చల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే మకాం వేయాల్సిన పరిస్థితి ఉంది. నిజానికి తెలుగుదేశం– జనసేన అవసరం బీజేపీకే ఉంది.
అయినా బీజేపీ పిలుపు కోసం బాబు–పవన్ ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఢిల్లీలో ఖాళీగా కూర్చోవాల్సి రావడం బాబు–పవన్కు ఒకరకంగా అవమానమే. అయినా కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యానికి తల వొంచక తప్పని నిస్సహాయత ఆ రెండు పార్టీలది అని కొత్త పలుకు ముగించారు.
మరి ఇంత అవమానం ఎదుర్కొంటూ ఢిల్లీలో మకాం వేసే బదులు 2019లోలా బీజేపీ వ్యతిరేక పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి మోడీని అష్టదిగ్భంధనం చేయొచ్చుగా. 2019లో బీజేపీకి ఎదురెళ్లి బాబు తిన్న కవుకు దెబ్బల తాలూకా వాపులు ఇంకా తగ్గలేదు. అందుకే బీజేపీకి ఎదురెళ్ళకుండా, పవన్తో రాయబారం నడిపించి కాళ్ళ బేరం చేసుకున్నారు. తన పార్టీ నుంచి గెలిచిన యంపీలను బీజేపీలోకి పంపాలని చూసినప్పుడే బాబు రాజకీయం అర్థం అవుతుంది. అయిదేళ్ళళో ఢిల్లీని గజగజా వణికించే స్థితి నుంచి, దేహీ అంటూ అదే ఢిల్లీలో అమిత్షా ముందు నిలబడం బాబుకి అవమానమే మరి. అసలే నలభయ్యేళ్ళ రాజకీయానుభవం, చాణక్యం, వగైరా వగైరాలు చిన్నపోవటమే మయసభలో ధుర్యోధనుడికి జరిగిన పరాభవం మాదిరి ఇది. అయితే ధుర్యోధనుడి పరాభవంలో పాంచాలి నవ్వింది తప్ప కౌరవుల వైపు ఎవరూ ధుర్యోధనుడిని తక్కువ చేయలేదు. కానీ బాబు వెనకే ఉండి తిరిగే రాధాకృష్ణ మాత్రం “బాబు వీకయ్యాడు” అంటూ వీకెండ్ కామెంట్ పెట్టడం విశేషం!!