అందరినీ తన అష్ట దిగ్బంధనంలో బంధించేసానని, సొంత పేపర్లలో కితకితలు పెట్టుకునే చంద్రబాబు ఇప్పుడు నిజంగానే అష్ట దిగ్బంధనంలో ఇరుక్కుపోయారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ పార్టీ దూకుడుగా దూసుకెళ్తూ, ఒంటరి పోరుతో సీట్లు ప్రకటించగా… చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం మల్లగుల్లాలు పడుతూ, బీజేపీ అడిగిన అన్ని సీట్లను దాదాపు అభ్యంతరం చెప్పకుండానే ఇచ్చేసి, పొత్తే పరమావధి అని తాపత్రయపడుతూ ఇప్పటి వరకూ గడుపుతూ వచ్చారు. ఎన్నికలు వచ్చే వేళ వరకూ అభ్యర్థులను ప్రకటించకుండా నాన్చుతూ వచ్చారు. దీనికి తోడు, అభ్యర్థులను ప్రకటించకుండా లేటు చేయడం, ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కూడా చోటు చేసుకుంటున్న గందరగోళాన్ని సరిచేయకుండా ఉండిపోవడంతో టీడీపీ వర్గం పూర్తిగా నిరాశలో మునిగిపోయింది.
మరొక వైపు, టీడీపీ జనసేన పొత్తులో జనసేనకు కేటాయించిన సీట్లలో ఇచ్చేది ఇరవై నాలుగు సీట్లే అని తెలిసిన జనసేన వర్గం కాపు నాయకులు భగ్గుమన్నారు. తర్వాత వీరిని ఓదార్చేందుకు టీడీపీ, జనసేన వరుస ప్రకటనలు చేసినా… ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులు, ఆశావహులు ఢీ అంటే ఢీ అన్న విధంగా తయారయ్యారు. పొత్తు వల్ల జరుగుతుంది అనుకున్న ఓట్ ట్రాన్స్ఫర్ జరిగేలా కనిపించడం లేదు.
ఇలా తెలుగు తమ్ముళ్ళు, జనసైనికులు పొత్తు, సీట్లు విషయాల్లో అసంతృప్తిగా ఉన్న వేళ, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు, బీజేపీతో పెట్టుకున్న పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ తన వాటాకి ఇచ్చిన వాటిలో మరికొన్ని సీట్లు తగ్గించుకోవడంతో ఈ పరిణామాలు కాపు తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి.
కొంత మంది కాపు నాయకులు తటస్థంగా ఉండగా, మరికొందరు కాపు నాయకులు వైసీపీ వైపు జరగుతున్నారు. ఈ నేపధ్యంలో పవన్ ఒంటరిగా మిగిలిపోయాడు. కాపు కురు వృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య కూడా పవన్ వ్యవహారంలో పెదవి విరిచి… “నిన్ను బాగుచేయలేను” అన్న తరహాలో ఉండగా.. జోగయ్య కుమారుడు వైసీపీలో చేరారు. కాపుల్లో ఎంతో ప్రభావవంతమైన నేత అయిన ముద్రగడ కూడా వైసీపీలో చేరబోతున్నారు.
మరోవైపు బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేస్తుందో ఇంకా ప్రకటించలేదు, ప్రకటించిన తర్వాత మరిన్ని వివాదాలు చెలరేగే సూచనలు ఉన్నాయి.ఐతే బీజేపీకీ, జనసేనకి కేటాయించిన సీట్లలో ఎన్ని ఈ కూటమి గెలుచుకుంటుంది అన్నది ప్రశ్నార్థకమే.ఈరోజుకి కేటాయించిన 30 సీట్లలో కనీసం ఐదయినా గెలుస్తారో లేదో తెలియని పరిస్థితిలో చంద్రబాబు కూటమి ఉంది. అంటే 175 సీట్లకు గాను 25 సీట్ల మీద ఇప్పటికే కూటమి ఆశలు వదిలేసుకున్నట్టే. గెలుస్తారా?
వీటన్నిటికి తోడు, టీడీపీలో పెరుగుతున్న రెబెల్స్ మరొక తలనొప్పిగా తయారయ్యారు. పల్నాడు నుంచి యరపతినేని, పిఠాపురం నుంచి వర్మ మొదలగు వారు బాహాటంగానే చంద్రబాబుపై తమ అసంతృప్తిని వెలిబుచ్చి… స్వతంత్రంగా బరిలోకి దిగుతామనే సంకేతాలు పంపుతున్నారు. నిన్నటికి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోయిన టీడీపీ అనుచరుల ప్రవర్తన చూసి వైకాపా వారే ఆశ్చర్యపోయిన పరిస్థితి.
ఇన్ని గందరగోళాల మధ్య బాబు ఇంకా మరి దశ అభ్యర్థులను ప్రకటిస్తే మరిన్ని తిప్పలు తప్పవు. అలా బాబు చుట్టూ అష్ట దిగ్బంధనం బిగిసిపోవడంతో… ఏం చేయాలో తెలియని స్థితిలో పడిపోయారు.