తెలుగుదేశం తొలి జాబితా ప్రకటించేందుకు చాలా కష్టపడ్డానని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కోటి మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఎంపిక చేశామని వెల్లడించారు. అయితే రోజు మారాక ఆయన స్వరం మారిపోయింది. సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని హెచ్చరించారు. ఈ విషయం ఎల్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎన్నో వడపోతల తర్వాత ఎంపిక చేశానని చెప్పిన నారా వారు అంతలోనే హెచ్చరికలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.
94 మంది అభ్యర్థులతో బాబు ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వారం పనితీరు పర్యవేక్షిస్తానని చెప్పారు. ఎన్నికల వరకు ప్రతి వారం రోజులకు ఒక సర్వే చేయిస్తా.. తేడా వస్తే వేటు తప్పదన్నారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని, టికెట్లు వచ్చేశాయని నిర్లక్ష్యం తగదన్నారు. పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశానని, తానే అభ్యర్థిని కదా అని ఇగోతో వ్యవహరిస్తే కుదరదన్నారు. జనసేన కేడర్తో సమన్వయం చేసుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారని ఈనాడు రాసుకొచ్చింది.
అసలు బాబు టికెట్లు ఇచ్చిందే అభ్యర్థుల డబ్బు మూటలు చూసి. ఎవరు ఎక్కువ ఖర్చు చేయగలరు?, పార్టీకి ఫండ్ ఎంతిచ్చారో పరిశీలించి స్థానాలు కేటాయించారు. ఈ నేపథ్యంలో కొందరు సీనియర్లను పక్కన పెట్టేశారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఇన్చార్జి బొల్లినేని రామారావును కాదని ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు ఇచ్చారు. కావలిలో మాలేపాటి సుబ్బానాయుడిని కాదని మైనింగ్ మాఫియా నడిపే కావ్య కృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చారు. కల్యాణదుర్గంలో అమినేని సురేంద్రబాబు అనే కాంట్రాక్టర్కు బాబు టికెట్ అమ్మేశారు. దీంతో ఇప్పటి వరకు కష్టపడిన హనుమంతరాయ చౌదరి బాధపడుతున్నారు. ఆయన వర్గం చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసింది. వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఇలా చెప్పుకొంటూ బాబు లీలలు చాలా ఉన్నాయి.
టికెట్లను అమ్మేసి.. ఇప్పుడు ప్రజల వద్ద మార్కులు కొట్టేసేందుకు ఎల్లో మీడియాలో బిల్డప్ కొడుతున్నారు. వాస్తవానికి బాబు ఒక్కరిని కూడా మార్చే ప్రయత్నం చేయలేడు. ఎందుకంటే సీనియర్లను, మరికొందరు ఇన్చార్జిలను పక్కన పెట్టడంతో చాలాచోట్ల పార్టీ నేతలు రగిలిపోతున్నారు. బహిరంగంగానే అధిష్టానాన్ని తిడుతున్నారు. ఈ అసమ్మతి సెగలు ఇప్పట్లో ఆగవు.
ఇక ఏకంగా అభ్యర్థులనే మారుస్తానంటే ఎవరు నమ్ముతారు. అదీ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో ఇది సాధ్యమయ్యే పని కాదని ఆయనకు కూడా తెలుసు. మరోవైపు టికెట్లు రాని జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. వారు సహకరించకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ కావని టీడీపీ అధినేతకు బాగా భయం పట్టుకుంది. అందుకే వారితో సమన్వయం చేసుకోవాలని తన అభ్యర్థులను ప్రత్యక్షంగా ఆదేశించారు. అయితే అది చెప్పినంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ను నమ్మి మోసపోయామని ఇప్పటికే చాలామంది సేన నేతలు, కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇక టీడీపీ నేతల మాటలు వినే పరిస్థితిలో వారు లేరనేది నిజం. తేడా వస్తే వేటు వేస్తానని చంద్రబాబు అన్నారు కానీ అవి ఉడత బెదరింపులే. వాటికి భయపడే నేతలు ఎవరూ లేరు. ఎందుకంటే అందరూ డబ్బు ఇచ్చి టికెట్లు కొనుగోలు చేసిన వారే కదా. బాబు కొట్టిన సీరియస్ డైలాగ్స్ చివరికి కామెడీ అయిపోయాయి.