రాజకీయాల్లో అవసరానికి వాడుకుని సమయం చూసుకుని నట్టేట ముంచడం అనే విద్య చంద్రబాబుకి వచ్చినంతగా ఈ దేశంలోనే మరో రాజకీయ నాయకుడికి రాదనే విషయం అందరికి తెలిసిన విషయమే. పొత్తుల్లో సైతం కమ్యునిస్టులకి , బీజేపీకి గతంలో బాబు చేసిన ద్రోహం ఇప్పటికీ ఆయా పార్టీ నేతలు ఆఫ్ ధ రికార్డ్ లో కధలు కధలుగా చెప్పుకోవడం విదితమే. అయితే చంద్రబాబుకు పక్క పార్టీ వారినే కాదు సొంత పార్టీ మనుషులను సైతం ఆశపెట్టి వాడుకుని అవసరం తీరాక వదిలించుకోవడం పరిపాటిగా మారిపోయింది.
చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అనుకుంటున్న తరుణంలో ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే పూర్తిస్థాయిలో పార్టీనీ సైతం ప్రజల్లో భూస్థాపితం చేసే విధంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు లోలోపల వాపోతున్నారు. నమ్మి వచ్చిన వారికి నమ్మకం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరుతో రగిలిపోతున్నారు. తాజాగా ఏలూరు పార్లమెంట్ స్థానాన్ని ఆశగా చూపీ ఎన్నారై గోరుముచ్చు గోపాల్ యాదవ్ ను వాడుకున్న తీరుని చూసి ఇక చంద్రబాబుని ఎప్పుడైనా నమ్మగలమా అంటూ తమని తాము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
టిడిపి యువనేత ఎన్నారై గోరుముచ్చు గోపాల్ యాదవ్ కు ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తామని స్వయంగా చంద్రబాబే హామీ ఇవ్వడంతో గోపాల్ యాదవ్ పార్టీ కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంతో పాటు సమయాన్ని సైతం వెచ్చించి పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాల్లో చంద్రబాబుని నమ్మి చురుగ్గా పాల్గొంటూ వచ్చారని. వైసీపీ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంతో ఇక గోపాల్ యాదవ్ కు టిడిపి టికెట్ కేటాయించడం లాంచనమే అనుకుంటున్న తరుణంలో. అనూహ్యంగా చంద్రబాబు మైదుకూరు ప్రాంతం నుండి పుట్టా మహేష్ యాదవ్ ను ప్రకటించడంతో క్యాడర్ లో అసంతృప్తి సెగలు రేగాయి.
చంద్రబాబుని నమ్మిన గోపాల్ యాదవ్ సైతం ఈ నమ్మక ద్రోహానికి తీవ్రంగా మనస్థాపానికి గురై టిడిపికి సైతం గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గోపాల్ యాదవ్ నిన్నటిరోజున తాను మాట్లాడిన సెల్ఫీ వీడియో ఒకటి విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ పార్టీ పరంగా జగన్ గారిని ఏదైనా విమర్శిస్తే తనని క్షమించాలని, రాజకీయంగా చేసిన విమర్శలే తప్ప తనకి జగన్ గారిపై ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని, నిజానికి జగన్ గారి ధైర్యాన్ని తాను ఎంతో మెచ్చుకుంటున్నానని 25 ఎంపీ స్థానాల్లో రిజర్వ్ స్థానాలు తీసేయగా మిగిలిన స్థానాల్లో అత్యధికం బీసీలకి కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యతను గురించి ప్రశంసిస్తూ టిడిపి పార్టీ తనకు చేసిన అన్యాయాన్ని గురించి ఆవేదన వ్యక్తం చేశారు..