తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మార్క్ రాజకీయాలను భారతీయ జనతా పార్టీ రుచి చూస్తోంది. ఓడిపోయే సీట్లను ఆ పార్టీకి ఇస్తాడని, సీనియర్లకు చెక్ పెడతారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అనుకున్నట్లే జరిగింది. శుక్రవారం 13 పార్లమెంట్ స్థానాలను టీడీపీ ప్రకటించగా సీనియర్ కమలం నేతలకు షాక్ కొట్టినంత పనైంది. బాబు తన మాటే నెగ్గించుకుని కమ్మ సామాజికవర్గానికి చెందిన సమీప బంధువుకు టికెట్ ఇచ్చారు.
జీవీఎల్ నరసింహారావు బీజేపీలో సీనియర్ నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేయాలని మూడు సంవత్సరాలుగా పని చేసుకుంటూ పోతున్నారు. వాస్తవానికి టీడీపీ ఎన్డీఏలో చేరకపోయుంటే ఆయనే అభ్యర్థిగా ఉండేవారు. కానీ ఏపీ కమలం పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తన సోదరి భర్త చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తుండడంతో సొంత పార్టీకి చెందిన సీనియర్ నేతల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జీవీఎల్ ఆశలపై ఆమె నీళ్లు కొట్టారు. పొత్తులో భాగంగా సినీ నటుడు నందమూరిబాలకృష్ణ చిన్నల్లుడు మాత్కుమిల్లి భరత్కు విశాఖ ఎంపీ సీటును కేటాయించారు. దీనికి పురందేశ్వరి కారణమని ప్రచారం జరుగుతోంది. తన తమ్ముడి అల్లుడి కోసం ఆమె బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జీవీఎల్ అవకాశాలకు గండి కొట్టారు. ఈయనకు ప్రజా బలం లేదని, టికెట్ ఇస్తే ఓడిపోతాడని అధిష్టానం పెద్దలకు రకరకాల నివేదికల్ని పంపి ఒప్పించారు. భరత్ బరిలో ఉండేలా లైన్ క్లియర్ చేశారు.
పురందేశ్వరి తీరుపై కమలం శ్రేణులు అవాక్కయ్యారు. ఆమె బీజేపీ కోసం పనిచేస్తోందనుకుంటే పూర్తిగా టీడీపీ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఆరోపిస్తున్నారు. బాబు మనుషుల ఒత్తిడితో హస్తిన పెద్దలు కూడా ఏమీ మాట్లాడకుండా చేతులెత్తేశారని తెలుస్తోంది.