నాగార్జునసాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నాగార్జునసా గర్ డ్యాంను సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలకు, నీటి యాజమాన్యాన్ని కృష్ణాబోర్డుకు అప్పగించడంపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.
గతంలో అక్టోబర్ 6, 2023 న కృష్ణా రివర్ బోర్డు.. శ్రీశైలంలో 30 TMCలను ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. వాటిలో 15 టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్కి తరలించింది. కానీ ఆ నీటిని ఏపీకి వదల్లేదు. వదలమని కోరినా పట్టించుకోలేదు. పైగా.. ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఆ నీటిని ఉపయోగించుకుంటోంది. ఈ విధంగా తెలంగాణ చేస్తున్న అన్యాయానికి సీరియస్ అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నవంబర్ 30న తెల్లవారుజామున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఏపీ పోలీసులు డ్యామ్ దగ్గరకు వెళ్లి.. ఏపీ వైపు ఉన్న 13 గేట్లను ఎత్తి.. కుడి కాలువ హెడ్ రెగ్యులేరట్ ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని వదిలారు.
ఇలా భారీ సంఖ్యలో అక్కడికి పోలీసులు వెళ్లేసరికి.. ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ నీరు గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం పంపినది. ఆ జిల్లాల్లో చాలా కాలంగా నీటి కొరత బాగా ఉంది. ప్రజలకు తాగునీటి అవసరాలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రవర్తించిన తీరుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా రియాక్ట్ అయ్యింది. ఇంతలా నాగార్జున సాగర్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇరురాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర జల శక్తి మంత్రిత్వశాఖ ఈరోజు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
శ్రీశైలం నిండితే తప్ప నాగార్జునసాగర్ కు నీరు రాదు. ఆంధ్రప్రదేశ్ లోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రజలకు నీరు అందాలంటే శ్రీశైలం ప్రాజెక్టు 881 అడుగులు వస్తే తప్ప నీళ్లు అందని పరిస్థితి. కానీ తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల్లోపే వారి లిఫ్ట్ ప్రాజెక్ట్స్ తో నీరు తోడేస్తుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ కు నీటి విషయంలో అన్యాయం జరుగుతుంది.
ఈరోజు జరిగే సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ కలిపి నిర్వహణ ప్రొటోకాల్, శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే ఔట్లెట్లను బోర్డుకు అప్పగించడంపైనా చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్ ఇన్ చీఫ్ లు పాల్గొననున్నారు