హైటెక్ సిటీ పేరుతో మాదాపూర్ భూములతో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం మామూలు స్థాయిది కాదని జగమంతా తెలిసిన విషయమే. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన సినీ నటుడు, చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు అయిన మాగంటి మురళీ మోహన్ కి ఈ భూముల్లో దక్కిన వాటా అంత ఇంతా కాదు. తొండలు గుడ్లు పెట్టని గచ్చి బౌలి స్థలాలు అన్నీ పదుల ఎకరాల కొద్దీ మురళీ మోహన్ కి జయభేరి ఎంక్లేవ్ పేరు మీద పావలాకీ అణాకీ కట్టబెట్టిన సంగతి తేట తెల్లమే.
ఈ రోజున జయభేరి ఎంక్లేవ్ లో గజం స్థలం లక్షల్లోనే. ఆ రోజున అవి అత్యంత చవగ్గా (అది కూడా కాగితాల మీదనే) కొట్టేసిన స్థలాలు అవి. అలాట్ మెంట్ అయిన స్థలాలు మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఉన్న స్థలాలను కూడా జయభేరి సంస్థ తేరగా తమ స్థలాల్లో కలుపుకుంటూ దాదాపు వంద ఎకరాల వరకూ అక్రమంగా ఆక్రమించింది
ఆ భూముల గురించి అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ వచ్చింది.రికార్డులలో లేకుండా పోయిన వంద ఎకరాల గురించి విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
1996 డిసెంబర్ 23న రెవెన్యూ కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి రాసిన లేఖ నం. 35392 లో ముఖ్య మంత్రికి ఈ విషయమై నివేదించాల్సి ఉంది కావున, త్వరగా నివేదిక ఇవ్వాలని కోరడం వల్ల ఈ విషయంలో ముఖ్య మంత్రికి ప్రమేయం ఉందని తేలుతుందని పార్టీ ఆరోపించింది. జయభేరి ఎన్ క్లేవ్ కి పవర్ ఆఫ్ అటార్నీ గా ఉన్న వెంకట రెడ్డి ముఖ్యమంత్రి భార్య భువనేశ్వరి కి మాదాపూర్ లో గరిష్ట భూ పరిమితి చట్టం కింద వచ్చే కోర్ ఏరియాను తప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తి. రోడ్ల వెడల్పు లో భాగంలో వేల మంది ఇళ్ళను కూలగొట్టిన వ్యక్తి తన భార్యకు మాత్రం అప్పనంగా భూమిని కట్టబెడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది
అంతే కాక, మొదటి దశలో ప్లాట్లు అమ్మరాదని, హుడా 1995 మార్చి 18న 1766 నెంబర్ లేఖ రాసినా దాన్ని ఉల్లంఘించి మరీ భారీ ఎత్తున అధిక ధరలకు అమ్మారని ఆరోపణలు ఉన్నాయి. అనుమతి లేక పోయినా హుడా అనుమతి ఉందని చెప్పి అమ్మారు.
ముఖ్యమంత్రికి, ఆయన బంధువులకు మాదాపూర్ లో వెయ్యి ఎకరాల భూములు ఉన్నాయని, అందుకు తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. తమ ఆరోపణలు తప్పని నిరూపించాలంటే, రికార్డులలో మాయం చేసిన వంద ఎకరాలకు కూడా లెక్కలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది . ఈ ఆరోపణల పై సమాధానం చెప్పలేని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్నాళ్ళు మీడియాకి కూడా దూరంగా ఉన్నారు.
ఆనాటి ధరలేమో కానీ ఈనాటి ధరల ప్రకారం జయభేరి ఆక్రమించుకొన్న ఆ వంద ఎకరాల విలువ అక్షరాలా అయిదు వేల కోట్ల రూపాయల పై మాటే
హైద్రాబాద్ హైటెక్ సిటీ వైపు ఇప్పుడున్న జయభేరి భూములన్నీ ఇలా నామమాత్రపు ధరకే మురళీ మోహన్ కి కట్టబెట్టడానికి కారణం ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చంద్రబాబుకి భాగస్వామ్యం ఉండటమే అనేది బహిరంగ రహస్యమే.