వివిధ ఘటనల్లో పశువులు, మూగజీవాలను కోల్పోతున్న పాడి రైతులను ఆదుకోవడానికి గతంలో ప్రభుత్వ పరంగా బీమా పథకం అంటూ లేదు. కాస్త అవగాహన ఉన్నవారు, ఆర్థిక స్థోమత కలిగిన వారు మాత్రమే ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలలో తమ జీవాలకు బీమా చేయించుకునే వారు. ఒకవేళ అవి చనిపోతే చాలాకాలంపాటు కంపెనీల చుట్టూ తిరిగి పరిహారం తెచ్చుకునేవారు. నూటికి 95 శాతం మంది అవగాహన లేక, ఆర్థిక భారం కారణంగా బీమాకు దూరంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో పాడి రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ పశు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. గతంలో ఉన్న పశు నష్ట పరిహరం పథకం స్థానంలో అనేక మార్పులతో కొత్త దానిని అమల్లోకి తీసుకొచ్చారు.
మన రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన అనేక మంది పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్ పశు బీమా పథకంలో భాగంగా బీమా చేసిన పశువులు అగ్ని ప్రమాదం, రోడ్డు ప్రమాదం, విద్యుత్ షాక్ లేదా జబ్బులు బారిన పడి, ఆపరేషన్ చేసిన తర్వాత చనిపోతే బీమా పరిహారం అందిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, తెల్లరేషన్ కార్డు కలిగిన పాడి రైతులు బీమా కంపెనీకి ప్రీమియంలో 80 శాతం, ఇతర రైతులు 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకంలో ప్రభుత్వం రూ.30 వేలకు బీమా చేయిస్తుంది. అంత మొత్తానికి పైగా అయితే మొత్తం రైతులు చెల్లించాల్సి ఉంటుంది. రూ.30 వేల బీమాకు గడువు మూడేళ్లపాటు ఉంటుంది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లోని (ఆర్బీకే) పశు సంవర్థక శాఖ సహాయకులు లేదా వెటర్నరీ అసిస్టెంట్ ద్వారా బీమా చేయించుకోవచ్చు. పాడి రైతులు ఆధార్ కార్డు, రేషన్, బ్యాంకు పాసుబుక్ జెరాక్సులు, యాజమాని, పశువుకు వేసిన ట్యాగ్ నంబర్ ఫొటో సమర్పించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు మొత్తం 5,594 మూగజీవాలకు బీమా చేశారు. లబ్ధిదారుల వాటా పోను ప్రీమియం రాయితీ కింద ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.71.76 లక్షలు చెల్లించింది. ప్రమాదవశాత్తు 46 పశువులు మరణించగా వాటిలో ఇప్పటి వరకు 40 పశువులకు రూ.12 లక్షల బీమా పరిహారాన్ని సంబంధిత రైతులకు అందజేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. పాడిపై ఆధారపడిన కుటుంబాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.