బుద్దా వెంకన్నని టీడీపీ నాయకుడు అనటం కన్నా బాబు భక్త హనుమాన్ అనొచ్చు. చంద్రబాబు నిప్పుల్లో దూకమంటే సమయానికి నిప్పులు లేవని బొగ్గుల్లో దూకగల సమర్ధుడు వెంకన్న. అతి సామాన్యునిగా జీవితం మొదలుపెట్టి టీడీపీలో అంచెలుఅంచెలుగా ఎదిగి ఎమ్మెల్సీ పదవి చేపట్టి కాల్ మని మరకలు పడ్డా విదిలించుకొని బాబు ఆత్మీయుడిగా నిలదొక్కుకొన్నాడు కానీ వైకుంఠపాళిలో చివరి మెట్టు వద్ద అదే బాబుకి కబలం అవుతున్నాడా అంటే అవుననే చెప్పొచ్చు .సుదీర్ఘ కాలంగా విజయవాడ వెస్ట్ సీట్ పై కన్నేసిన బుద్దా వెంకన్న ఈసారి ఆ సీటు తనదే అని ఆశ పెట్టుకొన్నాడు.
మరోవైపు 2014 లో విజయవాడ వెస్ట్ నుండి వైసీపీ తరపున గెలిచిన జలీల్ ఖాన్ తర్వాత అధికారం కోసం టీడీపీలోకి జంప్ అయ్యాడు. తర్వాత 2019 లో ఓడిపోయిన జలీల్ ఖాన్ మరోసారి సీటు తనదే అని ఆశ పెట్టుకొన్నా బాబు సీటు ఇవ్వటం పక్కన పెట్టి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటంతో ఎటూ పాలుపోక తలపట్టుకొన్నాడు. వైసీపీలో చేరటానికి ప్రయత్నిస్తున్నా పార్టీ పట్టించుకోవట్లేదని ఊహగానాలు వినిపిస్తున్నాయి.
టీడీపీలో అంతర్గత పోరు ఇలా ఉండగా పొత్తులో ఉన్న జనసేన నుండి 2019 లో ఇక్కడ పోటీ చేసిన పోతిన వెంకట మహేష్ మరోసారి పోటీ చేయటానికి ఉవ్విల్లూరుతున్నాడు. 2019 లో జనసేన తరపున 22367 ఓట్లు సాధించిన మహేష్ ఈసారి పొత్తులో భాగంగా ఖచ్చితంగా గెలుస్తాడని అతనికి సీటు ఇవ్వాల్సిందేనని పవన్ పట్టుబట్టినట్టు సమాచారం . ఈ నేపథ్యంలో మొదటి లిస్టులో విజయవాడ వెస్ట్ పేరు లేకపోవడంతో స్థానిక రాజకీయం వేడెక్కింది.
నేడు బుద్దా వెంకన్న తన వర్గంతో సమావేశమై భవిష్యత్తుకార్యాచరణ చర్చించడంతో పాటు ఇన్నాళ్ళూ బాబుకి ఎంత సేవ చేసినా విలువ లేకుండా పోయిందని, చివరికి దేశంలో ఏ రాజకీయ నాయకుడు తన రక్తంతో అధినేత పేరు రాయలేదని అలాంటిది తన రక్తంతో చంద్రబాబు పేరు రాసి నా ప్రాణం, నా దైవం ఆయనే అని చెప్పినా తనకు విలువ ఇవ్వలేదని చివరికి కొలికపూడికి ఇచ్చిన విలువ కూడా తనకు ఇవ్వలేదని వాపోయాడట పాపం.