రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికల్లా పాఠ్యపుస్తకాలు అందించేలా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు అందరికీ బైలింగ్వల్ పుస్తకాల ముద్రణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం. 2024 – 25 విద్యా సంవత్సరానికి 42 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరుతారని విద్యాశాఖ అంచనా వేస్తోంది. 42 లక్షల మంది విద్యార్థుల కోసం 4.5 కోట్ల పుస్తకాలను సిద్ధం చేస్తుంది. గత ఏడాది దాదాపు 20 లక్షల పుస్తకాలు మిగలడంతో మిగిలిన 4.28 కోట్ల పుస్తకాలు ముద్రిస్తున్నారు.
పుస్తకాల ముద్రణకు సంబంధించి ఒకటి నుంచి ఐదు, ఏడో తరగతి పుస్తకాల ముద్రణ బిడ్ ను ఉత్తర ప్రదేశ్ కు చెందిన పితాంబర ప్రెస్ దక్కించుకుంది. స్థానిక ఎంఎస్ఎంఈ లకు అవకాశం కల్పించడానికి ప్రభుత్వం 6,8,9,10 తరగతుల పుస్తకాల ముద్రణను మన రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం అందించేందుకు ఆ సంస్థలతో ముద్రణ చేపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక పేజీ ముద్రణకు 0.33 రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అత్యంత నాణ్యమైన 70 జిఎస్ఎం పేపర్ ని ముద్రణలో వినియోగించాలని ప్రభుత్వం నిబంధనలో పెట్టింది. పదవ తరగతి ఫిజిక్స్ పుస్తకాలకు మాత్రం ప్రత్యేకంగా అత్యంత నాణ్యమైన 80 జీఎస్ఎం ఆర్ట్ పేపర్ ని వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది.
స్కూల్లో తెరిచే నాటికి ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక క్రింద అందించే కిట్ లో ఇతర వస్తువులతో పాటు అన్ని పుస్తకాలు అందించాలని ప్రభుత్వం పనులను వేగవంతం చేసింది. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక ప్రభుత్వ పాఠశాలలో చేరే అదనపు విద్యార్థులు కూడా పుస్తకాలను అందించేందుకు ఐదు శాతం పాఠ్యపుస్తకాలను బఫర్ స్టాప్ గా ఉంచునున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతంలో విద్య ఏడాది ప్రారంభమైన మూడు నాలుగు నెలలకు గాను పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అందేవికావు. తద్వారా పిల్లలు ప్రయివేట్ విద్యా సంస్థలతో పోలిస్తే వెనుకబడి పోయేవారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ తెలుగు మీడియంతో పాటు ఉర్దూ కన్నడ ఒరియా తమిళం కన్నడ మాధ్యమం స్కూలు కూడా ఉన్నాయి. తెలుగు మాధ్యమం విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ ద్విభాష పుస్తకాలు ఇస్తారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ తో పాటు వారు ఎంచుకున్న భాష ఉన్న విభాష పుస్తకాలు అందిస్తారు. దీంతోపాటు సవర కొండ కోయ సుగాలి వంటి గిరిజన విద్యార్థులకు కూడా ఇదే విధానములో పుస్తకాలు ముద్రిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఒకటి నుంచి పదవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉండనుంది. గత ఏడాది వరకు 9వ తరగతి వరకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఉండేది. విద్యార్థులకు ఒకే సారి ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తే ఇబ్బంది పడతారు అని ప్రయోగాత్మకంగా గత రెండు సంవత్సరాలుగా 8, 9 తరగతులకు అమలు చేసుకుంటూ వచ్చి ఈ ఏడాది 10వ తరగతికి అమలు చేస్తున్నారు.
విద్యార్థులకు స్థానిక సంస్కృతులు, జాతీయ అంశాలపై అవగాహన ఉండేలా తరగతులను మూడు కేటగిరీలుగా విభజించి సిలబస్ రూపొందించారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు 100 శాతం ఎస్సిఈఆర్టి(స్టేట్) సిలబస్ ఉంటుంది. 6,7 తరగతులకు ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్ ఎన్సీఈఆర్టీ సిలబస్ లో తెలుగు,హిందీ,సోషల్ స్టేట్ సిలబస్ ఉంటాయి. 8,9,10 తరగతి ఫస్ట్, సెకండ్ లాంగ్వేజ్ ( తెలుగు, హిందీ) మినహా మిగతా సబ్జెక్టులన్నీ ఎన్సీఈఆర్టీ సిలబస్ లో ఉంటాయి.