పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సరిగ్గా 40 రోజుల గడువు కూడా లేదు . కానీ ఇంకా బీజేపీ టీడీపీకి చుక్కలు చూపిస్తుంది. కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వ్యవస్థల సహకారం దొరుకుతుందన్న ఆశతో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ పెద్దల అభయ హస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. కేవలం బీజేపీతో పొత్తు కారణంగానే టీడీపీ జనసేన రెండో జాబితాలో అభ్యర్థుల ప్రకటన చేయలేకపోతోంది.
ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడం అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ పొత్తును ఖరారు చేయకుండా కాలయాపన చేస్తూ ఉండటంతో టీడీపీ అభ్యర్థిత్వ ఆశావహులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పలువురు నాయకులు భావిస్తున్నారు. నిన్నటినుండి ఢిల్లీలో పాగా వేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ఎదురు చూపులకు నిన్న ఫలితం దక్కలేదు. అందుకే ఈరోజు కూడా బీజేపీ పెద్దలతో భేటీ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈరోజు జరిగే భేటీలో అయినా చంద్రబాబు నిరీక్షణకు ఫలితం దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే చంద్రబాబు ధోరణి తెలిసే, కావాలని బీజేపీ పెద్దలు బాబును వెయిట్ చేయిస్తున్నారన్న వాదనా కూడా ఉంది. ఏది ఏమైనా ఇలా బీజేపీ నాన్చుడు ధోరణి వల్ల నియోజకవర్గాల్లో ప్రజలకు చేరువ కాలేకపోతున్నామని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు ఇంతగా బెండ్ అయిపోతుండడం టీడీపీలో పలువురు నాయకులకు, టీడీపీ శ్రేణులకు నచ్చడం లేదు. బీజేపీ మాత్రం తీరిగ్గా ఆచితూచి స్పందిస్తుంది. ఈరోజైనా బీజేపీ పెద్దలు చంద్రబాబు నిరీక్షణకు తగిన ప్రతిఫలం ఇస్తారా లేక మరోసారి రమ్మంటారా అనేది ఈరోజు సాయంత్రానికి తెలిసిపోతుంది.