సామాజిక న్యాయమే అభివృద్ధిపథంగా ముందుకు సాగుతున్న వైనం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. గత 58 నెలల కాలంలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలనే తేడా లేకుండా అన్ని కులాలకు ఈ ముఖ్యమంత్రి సమన్యాయం చేస్తున్నారు. అయితే 2024 శాసనసభ, లోక్సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో బీసీలకు 48 శాసనసభ, 11 లోక్సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి వైఎస్ జగన్ ఇచ్చిన ప్రాధాన్యత అర్ధమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్సభ స్థానాలు ఉన్నప్పుడు ఈ స్థాయిలో బీసీలకు సీట్లు కేటాయించడం రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు.
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు బీసీలను మోసం చేశారు.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా వంచించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రాకముందు గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్లో బీసీలకు చెప్పిన దానికంటే అధికంగా చేశారు.
గత 58 నెలల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో..
గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్.. అధికారంలోకి వచ్చాక కేబినెట్లో బీసీ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు అవకాశమిచ్చారు. బీసీ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్ శాసనమండలిలో సైతం పదవులు ఇచ్చారు.
-ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. 84 మున్సిపల్ చైర్మన్ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. అలాగే, నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు.
గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు. బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన మేలును బీసీలు కూడా గుర్తుపెట్టుకున్నారు.. తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్కు జేజేలు పలుకుతున్నారు.