పొదుపు మహిళలను మరోసారి మోసం చేయడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టిన చరిత్ర ఆయనది. తాజాగా 24 ఎన్నికల కోసం ఇంకోసారి పొదుపు మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్లో గురువారం భేటీ అయ్యారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే అంశంపై చర్చించారు. చంద్రబాబు, పవన్ కలిసి ఈనెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే భారీ బహిరంగ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఈనాడు రాసుకొచ్చింది.
అప్పుడు ఏమి చేశాడంటే..
2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలు ఎవరూ బ్యాంకు లింకేజ్ రుణాలు తిరిగి చెల్లించవద్దని పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని, చెల్లించిన వారికి నగదు తిరిగి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిక బ్యాంకు లింకేజ్ రుణాలు రూపాయి కూడా రుణమాఫీ చేయలేదు. నాలుగున్నర ఏళ్లపాటు స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆయనకు గుర్తుకురాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు – కుంకుమ అంటూ రూ.10 వేలకు చెక్కులు పంపిణీ చేశారు.
అప్పట్లో బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు వచ్చాయి. రుణాల చెల్లింపు కాలాతీతం కావడంతో అప్పులపై వడ్డీ భారం పడింది. చేసేదేమీ లేక చంద్రబాబు మాటల విని మోసపోయామని తీసుకున్న రుణాలను తిరిగి అదనపు వడ్డీలతో కలిపి చెల్లించారు. ఇంకా మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి ప్రతి నెలా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు. క్రమం తప్పకుండా చెల్లించిన గ్రూపులకు వడ్డీ చివరిగా తిరిగి ఇస్తారు. బాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో పావలా వడ్డీ అర్హత కోల్పోవడంతోపాటు అదనపు వడ్డీ భారం పడింది.
చంద్రబాబు పసుపు- కుంకుమ పేరుతో రూ.10 వేలను మూడు దఫాలుగా చెల్లించారు. అయితే ఆ డబ్బు వడ్డీలకే సరిపోయింది. మహిళలకు ఏమీ మిగలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలా మోసం చేసిన బాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు పొదుపు మహిళలను టీడీపీ ప్రచార సభలకు రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మీటింగ్కు సొంత డబ్బులు పెట్టుకుని వెళ్లి నానా అగచాట్లు పడ్డారు. తాజాగా ఎన్నికలు దగ్గరకు రావడంతో మళ్లీ పొదుపు మహిళలకు రుణమాఫీ అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. పాత విషయాలన్నీ మరిచిపోయి ఓటేస్తారని భావిస్తున్నారు. అయితే తమకు అండగా నిలిచిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే మహిళలు జై కొడుతున్నారు. చంద్రబాబును నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.