Ashwini Vaishnaw : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు అవగాహన లేకనో.. పూర్తి సమాచారం లేకో రాజకీయ కారణాలతోనో విశాఖపట్నం రైల్వే జోన్కు ప్రభుత్వం భూమి ఇవ్వలేదని ఏదో చెప్పేశారు. అయితే నిజాలు తెలిసిన ఎల్లో మీడియా మాత్రం గగ్గోలు పెట్టింది. జగన్పై తప్పుడు రాతలకు కాదేది అనర్హం అన్నట్లుగా ప్రజల్లోకి తప్పుడు సమాచారం పంపేందుకు యత్నించి భంగపాటుకు గురైంది.
విశాఖపట్నం రైల్వే జోన్. ఇది విభజన చట్టంలోని హామీ. దీనిని నెరవేర్చడంలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. అది దాచేందుకు రకరకాల సాకులు చెబుతోంది. వాస్తవానికి రైల్వే శాఖ రూపొందించిన డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లోనే భవనాలు, ఇతర అవసరాలకు 950 ఎకరాలు విశాఖలో సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అసలు కేంద్ర మంత్రి గురువారం బడ్జెట్ అనంతరం మీడియాతో చెప్పిన 52 ఎకరాలకు, రైల్వే జోన్కు అసలు సంబంధమే లేదు. ఇది వేరే వ్యవహారం. ఆ భూమిని అప్పగించడంలో నిర్లక్ష్యం చేసింది గత చంద్రబాబు ప్రభుత్వం. అయితే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకుండా ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే మంత్రి సంబంధంలేని భూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు.
విశాఖ అభివృద్ధిలో భాగంగా 2013లో రాష్ట్ర ప్రభుత్వం రైల్వే భూమి 52 ఎకరాలు తీసుకుంది. దీనికి బదులుగా మరోచోట రైల్వేకు భూమి కేటాయించాలి. అయితే ఈ విషయాన్ని ఆనాటి కాంగ్రెస్, తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీంతో వైఎస్సార్సీపీ సర్కారు ఈ వివాదాన్ని పరిష్కరించి 52 ఎకరాలను రైల్వే శాఖకు ఎప్పుడో అప్పగించింది. దీనిని మంత్రి రైల్వే జోన్కు అన్వయించి తప్పుడు సమాచారం చెప్పారు.
ఎవరి కోసం..
అశ్విని వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేసింది ఒడిశాకు ప్రయోజనం చేకూర్చేందుకేనని విమర్శలున్నాయి. ఆయన ఒకప్పుడు అక్కడి ఐఏఎస్ కేడర్ అధికారి. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్ ఆర్థిక ప్రయోజనాలకు బీజేపీ ఆదేశాలతో మంత్రి పెద్దపీట వేస్తున్నారు. దీంతో వాల్తేరు డివిజన్ను రద్దు చేసి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతోనే కొత్త జోన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దీనిని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. వాల్తేరును కొనసాగిస్తూనే కొత్త జోన్ కావాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిని వైఎస్సార్సీపీ ఎంపీలు పలుమార్లు కలిసి చర్చించారు. అయితే ఆయన్నుంచి ఎలాంటి స్పందన రాలేదు. జోన్ ఏర్పాటును రాజకీయ అంశాలకు ముడిపెట్టి చోద్యం చూస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఎల్లో మీడియా విష ప్రచారానికి పూనుకుంది. వాస్తవానికి మంత్రి చెప్పిన 52 ఎకరాల విషయం వేరని తెలిసినా జగన్ ప్రభుత్వంపై నెపం నెట్టేందుకు ప్రయత్నించింది.
– వీకే..