మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం తీసుకురాలేదు. మహిళల జీవన ప్రమాణాలు పెరగాలని ఎన్నో పథకాలకు రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు సీఎం జగన్. మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తే ఆ మహిళల కుటుంబాలు మరింత మెరుగుపడతాయని భావించి పథకాలలో మహిళలకు పెద్ద పీట వేశారు. మహిళల కోసం డ్వాక్రా ఋణ మాఫీ, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అగ్రవర్ణ పేద మహిళల కోసం ఈబీసీ నేస్తం పథకాల ద్వారా మహిళలకు సంక్షేమాన్ని అందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా చెప్పిన సమయానికి నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలో ఏపీ ప్రభుత్వం నగదును జమ చేస్తోంది .
అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా లబ్ది చేకూర్చే విధంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బటన్ నొక్కడం పూర్తయిందనని మరి కొద్ది రోజుల్లో నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. ఈ రెండు మూడు రోజులు ఈనాడు, ఆంధ్ర జ్యోతి లాంటివి చూడొద్దని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
కాగా వైయస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్లలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా 15,000 చొప్పున 3 విడతల్లో మొత్తం రూ.45,000 ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని మొదలు పెట్టారు. ఇప్పటికే రెండు విడతల్లో డీబీటీ ద్వారా అర్హుల ఖాతాలో ఈబీసీ నేస్తం నిధులు జమ చేయగా, నేడు మూడో విడతగా మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రోజు జమచేయనున్నారు. ఈ రోజు విడుదల చేసే 629. 37 కోట్ల రూపాయలతో కలుపుకొని ఇప్పటివరకు 1876. 97 కోట్ల రూపాయలను ప్రభుత్వం అగ్రవర్ణ పేద మహిళలకు అందించింది. ఈ పథకం ద్వారా 4,95,269 మంది అగ్రవర్ణ పేద మహిళలు లబ్ది పొందారు. ఈ రోజు విడుదల చేసే మొత్తంతో ఇచ్చిన హామీ వందకు వంద శాతం పూర్తి అవుతుంది. కాగా ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీల ద్వారా 2,79,786 కోట్ల సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన లబ్దిదారులకు అందించింది.