“ ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధన ” కు మనబడి అనుకూలం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పాఠశాల్లో ఐబీ ప్రతినిధుల పరిశీలన..
పాఠశాలల సదుపాయాలపై సంతృప్తి..
బహుభాషా బోధన, టీచర్- విద్యార్థి మధ్య అనుబంధంపై ప్రశంస. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లోని పిల్లల భవిష్యత్తును విద్యతో పదిలపరుస్తున్నవేళ విద్యావిధానంలో సరికొత్త మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఐబీ విద్యావిధానంను తీసుకు వచ్చే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి.. ఈ మేరకు ఇంటర్నే షనల్ బాకలారియెట్ (ఐబీ) ప్రతినిధులు ఫిబ్రవరి 26 నుంచి మార్చి నెల ఏడో తేదీ వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటించారు. పర్యటన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ అమలుచేసే స్కూళ్ల ల్లో విద్యార్థుల వ్యక్తిగత ప్రొఫైల్ కు అధిక ప్రాధాన్యత నిస్తారు. ఆవిధంగా సమీక్షలు జరిపిన ఐబీ ప్రతినిధులు.. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన, బహుభాషలు మాట్లాడే విద్యార్థులు, చదువులో తమ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ఉపాధ్యాయులను ప్రశ్నించే తీరు.. ఎదుటివారితో మర్యాదగా మాట్లాడేతత్వం, పిల్లల్లో సహకారగుణం, క్లాస్ రూమ్స్ లో విద్యార్థులు -టీచర్ల మధ్యనున్న అన్యోన్యత తదితర అంశాలు అంతర్జాతీయ విద్యావేత్తలను ఆశ్చర్యపరిచినట్టు తెలిపారు. తాము పరిశీలించిన పాఠశాలల్లో చక్కటి వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పాఠశాల పరిశుభ్రతపై కేంద్రీకృత పరిశీలన, పాఠశాలల పనితీరు అద్భుతంగా ఉన్నట్లు పేర్కొన్నారు.. రోజువారి యాప్స్ వినియోగం, కేంద్రీకృత మానిటరింగ్ సిస్టం, టోఫెల్ శిక్షణ, కంటెంట్ అనుసంధానం అటల్ టింకరింగ్ ల్యాబ్స్, గ్రంథాలయాల వినియోగం, మెరుగైన అసెస్మెంట్, యూనిఫారం, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, పోషకాలతో కూడిన నాణ్యమైన మధ్యాహ్న భోజనం, టాయిలెట్ల నిర్వహణపై ఐబీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని, విద్యాశాఖను అభినందించారు.
తరగతి గదులలో బహుభాషావాదం, ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధం, పాఠశాల విద్యా వ్యవస్థపై సమాచారాన్ని పంచుకోవడంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతరులు ఆసక్తి చూపిన తీరు ఐబీ విద్యా విధానానికి దగ్గరగా ఉన్నట్లు ఐబీ ప్రతినిధులు తెలిపారు. ఐబీ అమలు విషయంలో ఏపీ పాఠశాల విద్యాశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాలున్నాయని, ఉపాధ్యాయులకూ తగిన అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచ పోకడలను అర్ధం చేసుకునేందుకు, అవకాశాలను అందుకునేందుకు ఐబీ పాఠ్యాంశాలను సులభంగా అనుసరించగలరన్న నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. ఐబీ బృందం పర్యటనకు సంబంధించిన పూర్తి నివేదికను జూన్ లో ప్రభుత్వానికి అందజేయనుంది. నివేదిక ఆధారంగా ఉపాధ్యాయులకు, విద్యాశాఖ సిబ్బంది శిక్షణనివ్వాలని అధికారులు నిర్ణయించారు.