ఉద్యాన పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుండడంతో పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వివిధ రూపాల్లో సాయం అందిస్తుండడంతో పండ్ల రైతులు ఈ ఘనత సాధించారు. దేశవ్యాప్తంగా 2023 -24 ఆర్థిక సంవత్సరంలో 11,20,77,190 టన్నుల పండ్లు ఉత్పత్తి కాగా, ఇందులో ఆంధ్రప్రదేశ్ 1,81,11,600 టన్నుల పండ్లని ఉత్పత్తి చేసింది, ఆంధ్రప్రదేశ్ వాటా అత్యధికంగా 16.16 శాతంగా ఉంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల వారీగా పండ్ల ఉత్పత్తి సాగు విస్తీర్ణంపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ముందస్తు అంచనాలను వెల్లడించింది.
2023 -24 ఆర్థిక ఏడాదిలో 1,81,11,600 టన్నుల పండ్ల ఉత్పత్తితో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత మహారాష్ట్ర 1,42,78,250 టన్నుల పండ్ల ఉత్పత్తితో రెండో స్థానంలో నిలిచింది. ఉత్తర ప్రదేశ్ 1,27,02,060 టన్నుల పండ్ల ఉత్పత్తితో మూడో స్థానంలో నిలిచింది.
అరటి ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో, ఉత్తర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచాయి. మన రాష్ట్రంలో అరటి ఎక్కువ ఉత్పత్తి చేసే ప్రాంతాలలో పులివెందుల ఒకటిగా ఉంది. విదేశీ ఎగుమతులను దృష్టిలో పెట్టుకొని 20 కోట్ల రూపాయలతో బనానా ప్యాకింగ్ సెంటర్ ని కూడా ప్రభుత్వం పులివెందులలో ఈ మధ్యనే ఏర్పాటు చేసింది.
బత్తాయి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో తెలంగాణ నిలిచింది. మన రాష్ట్రంలో బత్తాయి ఎక్కువగా రాయలసీమ జిల్లాలైన అనంతపురం కడప కర్నూల్ లో సాగు చేస్తారు.
నిమ్మ ఉత్పత్తిలో ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో గుజరాత్, మూడో స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచాయి. మన రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో నిమ్మని సాగు చేస్తారు.మామిడి ఉత్పత్తిలో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది, తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మామిడి పంటను కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రదేశాలలో సాగు చేస్తారు. బొప్పాయి ఉత్పత్తిలో గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. బొప్పాయి కూడా రాష్ట్రo మొత్తం సాగు చేస్తారు.
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణమే ఉన్నా కూడా పండ్ల ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్లో పండ్ల సాగు విస్తీర్ణం 7,80,315 హెక్టార్లు ఉండగా, మహారాష్ట్రలో 8,48,370 హెక్టార్లలో పండ్ల సాగు విస్తీర్ణం ఉంది. ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు వల్లే ఇంతటి పురోగతిని ఆంధ్రప్రదేశ్ సాధిస్తుందని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలిపింది.