ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యక్ష నగదు బదిలీలకు అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించి చివరి విడత నిధులు లబ్ధిదారులకు జమ కాలేదు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, విద్య దీవెనలకు సంబంధించి చివరి విడత నగదు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ పథకాలకు సంబంధించి లబ్ధి అర్హులైన లబ్ధిదారులకు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష నగదు బదిలీలపై ఏపీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. డీబీటీలకు అనుమతి ఇవ్వాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఈ పథకాలన్నీ ఐదేళ్ల నుంచి అమలవుతూ వస్తున్నవేనని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని డీబీటీలకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో కోరింది.
2019లో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లు కాలంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేసింది. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్సార్ ఆసరా, విద్య దీవెన, జగనన్న చేదోడు వంటి పథకాలను తీసుకొచ్చింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందించేందుకు మధ్యలో ఎటువంటి దళారి వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో నగదు జమ అయ్యేటట్లు శ్రీకారం చుట్టారు. బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేయడం ద్వారా పథకాల లబ్దిని అర్హులైన లబ్ధిదారులకు అందిస్తూ వచ్చింది. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ పథకాలకు డీబీటీ ద్వారానే చెల్లింపులు చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో వీటిలో కొన్ని పథకాలకు సంబంధించి నగదు బదిలీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పాత పథకాలకు డీబీటీ ద్వారా నగదు బదిలీకి అనుమతించాలని ప్రభుత్వం ఈసీని కోరినట్లు తెలుస్తోంది.