పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఉపవాస దీక్షలు తీసుకొనే ముస్లిం విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉర్దూ పాఠశాలలో తరగతుల నిర్వహణ సమయాలలో మార్పులు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ మార్చ్ నెల 12 వ తారీఖు నుంచి ప్రారంభం కానుంది. ఈ రంజాన్ మాసంలో అత్యధిక సంఖ్యలో ముస్లి సోదరులు ఉపవాస దీక్షలు తీసుకొని పగటి సమయమంతా నిరాహారంగా ఉంటారు. నెలరోజులపాటు జరిగే ఈ ఉపవాస దీక్షలు ఏప్రిల్ 11 వ తారీఖుకి ముగుస్తాయి. ఈ రంజాన్ మాసం ఉపవాస దీక్షలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో తరగతుల నిర్వహణ సమయాలలో మార్పులు చేశారు.
ఈనెల 12వ తేదీ నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు రంజాన్ మాసం సమయంలో పాఠశాలలని ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు నిర్వహించేలా మార్పులు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు సంభందించిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. మిగిలిన అన్ని పాఠశాలలకు సాధారణ సమయాలు అంటే ఉదయం 9 గంటలకి ప్రారంభమయ్యి ,సాయంత్రం 4 గంటల వరకు యధావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న వేసవి కాలం సందర్భంగా ఒంటిపూట బడుల నిర్వహణ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఒక ప్రశ్నకి సమాధానంగా తెలిపారు.