దేశంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని శుక్రవారం విడుదల చేసింది. పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారెంటీల పేరుతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలిసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ రూపొందించిన మేనిఫోస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చడం గమనార్హం. 48 పేజీలతో ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు.
ఉద్యోగాల కల్పన, సంపద సృష్టి, సంక్షేమంపై ప్రధానంగా దృష్టి పెట్టి కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వెల్లడించారు. బీజేపీ పాలనలో దేశంలో ప్రజలకు ఎలాంటి న్యాయమూ జరగలేదని ఈ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి, అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తుందనిపేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ మేనిఫెస్టోను పరిశీలిస్తే యువత, రైతులు, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు అర్ధమవుతుంది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు, మహిళల ఓట్లను కొల్లగొట్టేందుకు కొన్ని ఆకర్షణీయ హామీలను గుప్పించింది.