బాబుతో పొత్తు అంటే కత్తి మీద సాము అని ఆయనతో పొత్తు పెట్టుకున్న వారందరికీ తెలుసు. అసలు పొత్తు ధర్మం అనే దానిని తూట్లు పొడిచి, ఓట్లు గుంజడంలో బాబు నిజంగానే విజనరీ. ఆయనతో పొత్తు పెట్టుకున్నాక బాగు పడ్డ పార్టీ ఒక్కటి కూడా లేదు. ఎదుటోడి శక్తిని సర్వం పీల్చి పిప్పి చెయ్యగల శక్తి బాబుకి సొంతం.
అసలు ఒక రకంగా బీజేపీ ఇన్నేళ్ళయినా… ఆంధ్రప్రదేశ్లో తన ఉనికిని చాటుకోలేక పోవడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి… వాళ్ళు బాబుతో చాలా కాలం క్రితం పొత్తు పెట్టుకోవడమే. ఒకసారి వాళ్ళు పొత్తు పెట్టుకున్నాక… అందులోని మరొక నాయకుడు ఎవరూ ఎదగలేనంతగా బాబు తాను మర్రి చెట్టులా మారి… మిగతా వారిని ఆవ మొక్కలా సరిపెట్టేస్తారు ఇన్నేళ్ళుగా బీజేపీకి ఓట్లు రాల్చగల నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో తయారవకపోవడానికి ఒక రకంగా బాబు తాలూకా ఉక్కు కౌగిలి కూడా ప్రధాన కారణం.
అందుకే, తెలంగాణ విడిపడ్డాక… బాబు ఆంధ్రా కి వచ్చి పడ్డాక… తెలంగాణ బీజెపీలో నిఖార్సైన నాయకులు తయారయ్యారు కానీ… ఆంధ్రలో నాయకులు కరుసైపోయారు. ఇప్పుడు మళ్ళీ అటువంటి ధృతరాష్ట్ర కౌగిలికే బాబు తెరలేపారని ఆంధ్ర బీజెపీ నాయకత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్రానికి లేఖ కూడా రాసింది. బాబోయ్ .. పొత్తులు, సీట్ల కేటాయింపు, అభ్యర్థులపై ఈ వెన్నుపోటును.. బాబును తట్టుకోలేం అంటూ… మోదీ, నడ్డా, అమిత్షాలకు తొమ్మిది మంది సీనియర్ ఏపీ బీజేపీ నేతలు లేఖ రాసారు.
తాము కూటమికి వ్యతిరేకం కాదు కానీ, పొత్తులో బీజేపీకి కేటాయించిన 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలను గమనించమనీ, బీజేపీకి కేటాయించిన సీట్లలో గతంలో టీడీపీ ఎప్పుడూ గెలవలనే లేదు అనీ,అంత బలహీనమైన అసెంబ్లీ సీట్లు మన పార్టీకి ఇచ్చారనీ, ఎంతో కాలంగా బీజేపీ కోసం పని చేస్తున్న వాళ్లకు కాకుండా బీజేపీ లోకి బాబు పంపిన అభ్యర్థులకే సీట్లు ఇస్తున్నారనీ తమ గోడును కేంద్రం ముందు ఉంచారు.
ఈ లేఖలో బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్. దయాకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేటుకూరి సూర్యనారాయణ రాజు, రాష్ట్ర కార్యదర్శి కె. సురేంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యురాలు కె. శాంతారెడ్డి, బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు, మహిళా మోర్చా జాతీయ మాజీ కార్యదర్శి మాలతీరాణి మొదలగు వారు సంతకాలు చేసారు.
కేంద్రం స్థాయిలో బీజేపీ రాజకీయాలు వేరేగా ఉండొచ్చేమో కానీ, ఆంధ్రలో ఒకసారి బాబుతో పొత్తు పెట్టుకున్నాక… మామూలుగా ఉండదని రాష్ట్ర స్థాయి నాయకులకు అర్ధం అయినంత బాగా ఢిల్లీ పెద్దలకు అర్ధం అవలేదు కనుక, పాపం వాళ్ళు ఇలా బహిరంగ లేఖ రాసారు. అదీకాక… బాబుకి సీటు ఇచ్చినట్టే ఇచ్చి… ఆపై తన పార్టీలో వారిని రెబెల్గా పోటీ చేయించే చరిత్ర కూడా ఉన్నదాయె. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద తెదెపా వారు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. వీటన్నింటినీ చూసే ఆంధ్ర బీజేపీ పెద్దలు త్వరగా కళ్ళు తెరిచి లేఖ రాసినట్టున్నారు.