ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో జాతీయ కస్టమ్స్, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ (నాసిన్) ఏర్పాటు కాబోతుంది. నేడు ప్రధాని మోదీ నాసిన్ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు.
2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపనలకు పరిమితం అయ్యారు తప్ప ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అకాడమీ నిర్మాణం విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో పనులు వేగవంతంగా జరిగాయి. తద్వారా పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని అత్యంత భద్రత నడుమ కొనసాగే విధంగా నిర్మాణం పూర్తి చేశారు.ఐఏఎస్లకు ముస్సోరి, ఐపీఎస్లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు.
నాసిన్ లో శిక్షణ పొందే వారికోసం అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసారు. శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని ఇప్పటికే తీసుకొచ్చారు. నాసిన్ ప్రత్యేక రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో పనిచేసే సిబ్బంది పిల్లల విద్య కోసం సమీపంలోనే కేంద్రీయ విద్యాలయం మంజూరు చేశారు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు ఈ శిక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతోపాటు రక్షణ బలగాలు అక్కడికి చేరుకుని ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు.