2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈరోజు రేపో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ప్రకటించుకుంటూ పోతున్నాయి. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను రేపు ఇడుపులపాయ వేదికగా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించనున్నారు. రేపు ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచే వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 18వ తేదీ నుంచి తన ఎన్నికల ప్రచారం సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మొదలు పెడుతున్నట్లు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ప్రకటించింది. 2019 ఎన్నికల ప్రచారం కూడా శ్రీకాకుళం జిల్లాలోనే మొదలు పెట్టారు జగన్. అదే రోజు మూడు చోట్ల ప్రచారం నిర్వహిస్తున్నారు పార్టీ వర్గాలు తెలిపాయి.ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచారం తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తారు , విజయవాడ పశ్చిమలో ప్రచారం ముగిసిన తర్వాత నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో తన ఎన్నికల ప్రచారం నిర్వహించి తాడేపల్లి నివాసానికి చేరుకుంటాడు. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభలతో తన కార్యకర్తలను ఉత్తేజ పరిచి ఎన్నికల రంగంలోకి దించేశారు.
కాగా 2019 ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్టుని నందిగం సురేష్ చేత విడుదల చేయించిన జగన్ ఈసారి ఎవరి చేత విడుదల చేయిస్తాడు, ఆ అదృష్టం ఎవరికి దక్కనుంది అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి .