డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ (దీక్ష) యాప్ వినియోగంలో ఆంధ్ర ప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కోసం దీక్ష యాప్ ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొని వచ్చింది.
గతంలో పాఠ్యపుస్తకాలలోని అంశాలు ఉపాధ్యాయులు బోధనా సమయంలో విద్యార్థులు అందరికి అర్థమయ్యే రీతిలో ఉండేది కాదు. అందుకోసం ఆ అంశాలు అర్థం కాని పిల్లలకి వీడియోల రూపంలో అందుబాటులోకి తీసుకొని వస్తే విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటారని కేంద్ర సంస్థలైన ఎన్సీఈఆర్టీ, ఎమ్ హెచ్ ఆర్ డి దీక్ష యాప్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చాయి. దీక్షా యాప్ ప్రత్యేకత ఏమిటంటే పాఠ్యాంశంలోని అన్ని అంశాలు వీడియోలు రూపంలో అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఉపాధ్యాయులు చెప్పింది అర్థం కాకపోయినా విజువల్ రూపంలో విద్యార్థులు చూసుకోవచ్చు. దీని ద్వారా పిల్లలకి పలు అంశాల పై మరింత అవగాహన ఏర్పడుతుంది.
దీక్ష యాప్ ని 2017 లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన అభ్యాసన ఫలితాలను పెంపొందించడానికి ఉపాధ్యాయుల సాధికారత, వృత్తిపరమైన అభివృద్ధి కోసం, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలో అన్ని రాష్ట్రాలలో దీక్ష యాప్ ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా భిన్నంగా క్షేత్రస్థాయిలో దీక్షపై విస్తృత ప్రచారం చేపట్టి అమలు చేసి పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో అధికారులు విజయం సాధించారు. దీక్ష యాప్ ని మన రాష్ట్రంలో 67 లక్షల మంది వినియోగిస్తున్నారు అని విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. దేశస్థాయిలో మరే రాష్ట్రంలో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న దాఖలాలు లేవు.
దీక్ష యాప్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసి పాఠ్యంశంలోని అంశాల పక్కనే క్యూఆర్ కోడ్ ని ప్రవేశపెట్టారు దాని ద్వారా మనం మన కెమెరా ద్వారా ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే డైరెక్ట్ గా ఆ టాపిక్ కి సంబంధించిన వీడియో ప్లే అవుతుంది తద్వారా విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ మొదట ఆంధ్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, కేంద్ర విద్యాసంస్థయిన ఎన్సీఈఆర్టీ మనల్ననుసరించింది.
ప్రతి పాఠ్యాంశంలోని అంశాలు వీడియోలు రూపంలో అందుబాటులో ఉండడంతో ఉపాధ్యాయులకు బోధన చేసే సమయంలో శ్రమ తగ్గింది. పాఠ్యాంశ బోధన సమయంలో ఇంటరాక్టివ్ ప్యానల్స్ పైన ఈ వీడియోలు ప్లే చేయడం ద్వారా ఆ పాఠ్యంశం చెప్పడం సులభం అయింది. ఈ వీడియోల ద్వారా ఆ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసుకోవడానికి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయి. సాంకేతిక పరిజ్ఞానం గల మంచి బోధన సామర్థ్యం గల ఉపాధ్యాయులు చేత సాంకేతికను జోడించి వీడియోలను రూపొందించి దీక్ష యాప్ లో పొందుపరుస్తున్నారు. దీక్ష ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. టెక్నాలజీ వినియోగంలో ఆంధ్ర వేగంగా ముందుకు దూసుకువెళ్తోంది.