స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. స్వచ్ఛ ఆంధ్ర అనే లక్ష్యంతో ఇప్పటికే ప్రతి ఇంటికి ఇటు గ్రామ పరిధిలోను, అటు పట్టణ పరిధిలోని తడి చెత్త, పొడి చెత్త అని రెండు స్టోరేజ్ డబ్బాలు ఇచ్చి చెత్తని కలెక్ట్ చేసుకోవడానికి ఇంటి వద్దకే చెత్తను సేకరించే వాహనాలను పంపిస్తున్నారు. ఇలా ఇంటి వద్దకే వచ్చి చెత్తను సేకరించడం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతలా అమలు పరచలేదు. కొన్ని మెట్రో సిటీలో చేస్తున్నప్పటికీ అది పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదు. రాష్ట్రంలో పూర్తిస్థాయి స్వచ్చ గ్రామాలుగా తీర్చిదిద్దే సంకల్పంతో ప్రభుత్వం ఉందని పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ సాధన ధ్యేయంగా అధికారులు అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రస్తుతం వినియోగంలో ఉన్న మరుగుదొడ్ల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని కూడా సర్వే ద్వారా గ్రామ పంచాయతీల కార్యదర్శుల పర్యవేక్షణలో ఇంజనీర్ అధికారులు సర్వే సమాచారాన్ని సేకరించాలని ఆయన సూచించారు. మురుగు నీరు నిల్వ ఉండకుండా తీసుకుంటున్న చర్యలను కూడా సర్వే అధికారులు పరిశీలించాలన్నారు. ఇందుకోసం స్వచ్ఛంద కార్పొరేషన్ రూపకల్పన చేసిన ఓడిఎఫ్ ప్లస్ – ఎస్బీఎం సర్వే యాప్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ గ్రామ పంచాయతీల కార్యదర్సుల పర్యవేక్షణలో ఇంజనీరింగ్ విభాగం ప్రతినిధులు సర్వే సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణకు సమకూర్చిన ట్రాక్టర్లు ఆటోలు ట్రై సైకిల్లు ఎంతవరకు వినియోగంలో ఉన్నాయన్న సమాచారాన్ని కూడా సేకరించమని అధికారులను కోరారు. ఆయా గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో సహా మిత్ర యాప్ ని ఇటీవలే ప్రారంభించడం జరిగిందని గంధం చంద్రుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు పాల్గొన్నారు.