హూ కిల్డ్ బాబాయ్ కాదు హూ కిల్డ్ కోడెల? హు కిల్డ్ వంగవీటి రంగా? వీటికి సమాధానం చెప్పాలని సత్తెనపల్లి ఎమ్మెల్యే, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు ఈ మధ్య పలు సభల్లో మాట్లాడుతూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ బిగ్గరగా అరుస్తున్నాడని, అసలు వివేకానంద రెడ్డి హత్య జరిగిందే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడని, హంతకులని ఆనాడే పట్టుకోకుండా నేడు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఆ నెపాన్ని సీఎం జగన్ పై మోపాలనే ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నాడని అంబటి రాంబాబు మండి పడ్డారు. హత్య చేయించింది బాబు వర్గమైతే సీఎం జగన్ నిప్రశ్నించడం ఏంటని చెప్పుకొచ్చిన అంబటి, 2017 ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ఆర్సిపికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో వివేకానంద రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశం ఉన్నా, ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి తన అధికార మదంతో ఎంపీటీసీలు జడ్పిటిసిలను కొనేసి ఆయన ఓటమికి కారుకులయ్యారు కానీ ఇప్పుడు కపట ప్రేమలు ఎందుకు చూపిస్తున్నారని విమర్శించారు.
1989 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల ఇంటి స్థలాల పట్టాల కోసం ధర్నా చేస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగాని పొట్టన పెట్టుకున్న నీతి చరిత్ర ఎవరిది అని ప్రశ్నించిన అంబటి, నిన్నే నమ్ముకున్న కోడెలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ఒక సీనియర్ నాయకుడని కూడా చూడకుండా, అవమానానికి గురి చేసి ఆత్మహత్య చేసుకునేలా చేసింది నువ్వు కాదా బాబు అని దుయ్యబట్టారు. మా పార్టీ వదిలేసిన స్క్రాప్ అంతా టీడీపీలో చేర్చుకొని, గొప్ప విజయం సాధించినట్లు చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని అంబటి ఎద్దేవా చేశారు. నరసరావుపేట ఎంపీ సెగ్మెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసి వర్గాలకు సంబంధించిన వారు పోటీ చేస్తున్న తరుణంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిత్వాన్ని ఒక బీసీ కులానికి చెందిన వారిని పోటీ చేయించాలని సీఎం జగన్ భావించి, ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలను గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయమని కోరారు. అందుకు ససేమీరా అన్న లావును మీ పార్టీలో చేర్చుకొని నరసరావుపేట ఎంపీగా అభ్యర్థి గా పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తున్నావు అంటే బీసీలపైన నీకున్నటువంటి ప్రేమ ఇక్కడే తెలుస్తోందని చంద్రబాబుని అంబటి దుయ్యబట్టారు.
ప్రశాంత్ కిషోర్ కు లగడపాటి గతే పడుతుందని, 2019 సార్వత్రిక ఎన్నికల ద్వారా లగడపాటి పొలిటికల్ సర్వేలు మరోసారి చేయకుండా సన్యాసం తీసుకుంటే, 2024 సార్వత్రిక ఎన్నికల ద్వారా ప్రశాంత్ కిషోర్ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీకి మేలు చేయడానికే బాబు ప్రశాంత్ కిషోర్ ద్వారా స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నాడని, రెండు నెలల క్రితమే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని ఉండవల్లిలో కలిసి వెళ్ళాడు. గత కొద్ది రోజుల నుంచి చంద్రబాబుని తరచూ కలుస్తున్న ప్రశాంత్ కిషోర్ మాటలు టీడీపీకి లాభం చేకూర్చేలా ఉంటాయని, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తాము చేసిన సంక్షేమ అభివృద్ధి తమను గెలిపిస్తుందని అంబటి రాంబాబు వెల్లడించారు.