‘ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కుదిర్చిన పొత్తు ఇది. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అందరూ మాతో చేతులు కలపాలి’ తాడేపల్లిగూడెంలో బుధవారం జరిగిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రజానీకానికి నవ్వు తెప్పించే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన దృష్టిలో ప్రజలు వెర్రివాళ్లు. మాటలన్నీ ఆ కోవలోనే ఉంటాయి. తాను ఏమి చెప్పినా నమ్మేస్తారు. ఒకవేళ ఎవరైనా అనుమానపడుతుంటే నమ్మించడానికి చేతిలో పచ్చ మీడియా ఉందని ఆయన ధైర్యం. స్వార్థ పూరిత రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ నారా వారనే విషయం మన రాష్ట్ర వాసులకే కాదు.. ఇతర రాష్ట్రాల్లోని సీనియర్ పొలిటీషియన్లకు బాగా తెలుసు. ఆయన రాజకీయ జీవితంలో అవసరాలే కనిపిస్తాయి తప్ప ప్రజల కోసమనే మాటకు ఆస్కారం లేదు. పదవి కోసమే ఎంతకైనా తెగించే రకం.
బాబు మాటలు తెలుగు తమ్ముళ్లు, దత్తపుత్రుడిగా పేరొందిన జనసేన పవన్ కళ్యాణ్కు నచ్చుతాయేమో కానీ ప్రజలకు ఏ మాత్రం రుచించవు. గతం చేసిన పనులు, ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలే ఇందుకు నిదర్శనం. పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కొని ఆయన్ను తిట్టారు. అప్పుడు కూడా ప్రజల కోసం, పార్టీ బాగు కోసం, రాష్ట్రం కోసమంటూ కబుర్లు చెప్పారు. ఓటములు దరి చేరే సరికి మళ్లీ మామను పొగిడి ఆయన ఫొటోలకు, విగ్రహాలకు దండలు వేసిన ఘనుడు. నారా వారికి ఏనాడూ స్థిరత్వం ఉండదని అనేక సందర్భాల్లో రుజువైంది.
ఉదాహరణకు 2014 ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీ, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. 2019 ఎన్నికలకు వచ్చే సరికి టీడీపీ అధినేత కాంగ్రెస్ నీడలోకి వెళ్లారు. అప్పుడు దేశ ప్రజల కోసమే ఈ స్నేహమని డప్పు కొట్టారు. రాష్ట్రాలు తిరిగి బీజేపీ ప్రత్యర్థులను కలిశారు. పోనీ వారితో అలాగే కొనసాగాడా అంటే లేదు. నరేంద్రమోదీ ఓడిపోతారని భావిస్తే భారీ మెజార్టీతో రెండోసారి ప్రధాని అయ్యారు. ఇక చంద్రబాబు స్వరం పూర్తిగా మారిపోయింది. కేసులకు భయపడి.. ప్రజల కోసమనే సాకుతో కాషాయ పార్టీ భజన మొదలుపెట్టారు. వారితో కలవడం.. వదిలేసి రావడం.. మళ్లీ బతిమిలాడి అతుక్కోవడం ఆయనకు అలవాటుగా మారిపోయింది. ఇందులో ప్రజల కోసమే కాన్సెప్ట్ ఎక్కడుంది బాబూ.. మీ దిక్కుమాలిన రాజకీయాలే కనిపిస్తున్నాయని తెలుగు తమ్ముళ్లే అసహ్యించుకుంటున్నారు. ప్రతిసారీ జనానికి నచ్చజెప్పలేకపోతున్నామనేది వారి బాధ.
2019 ఎన్నికలకు బాబు ఒంటరిగా వెళ్లారు. జనసేనను వేరే పార్టీలతో కూటమి కట్టించారు. అందరూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సునామీలో కొట్టుకుపోయారు. దీంతో 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఒంటరిగా ఢీకొట్టే సత్తా లేక మళ్లీ సేనతో కూటమి కట్టారు. బీజేపీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారు. ఇందులో పూర్తిగా స్వార్థమే కనిపిస్తోంది. విడిపోయి నానా రకాలుగా తిట్టి.. ఇప్పుడు ప్రజల కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పడం నారా వారికే చెల్లుబాటైంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, తన సోషల్ మీడియా ఏదో ఒక విధంగా ప్రజలను ఏమారుస్తాయని ఆలోచన. అప్పుడప్పుడైనా నిఖార్సయిన రాజకీయాలు చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని బాబు అన్నారు. పునర్నిర్మాణం కోసం తమను గెలిపించాలని కోరారు. అసలు విషయం ఏమిటంటే ఆయన రాజకీయ జీవితానికే ఇవి చాలా కీలకం. పార్టీని పునర్నిర్మించాలంటే గెలిచి తీరాలి. ఇప్పటికే వృద్ధాప్యం వచ్చేసింది. కొడుకు లోకేశ్ మాటలు, చేష్టలు చూసి జనం నవ్వుతున్నారు తప్ప భావి నాయకుడిగా చూడడం లేదు. అలా అని నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ను దగ్గరకు రానివ్వలేడు. ఈసారి అధికారంలోకి రాకపోతే టీడీపీ నేతలందరూ వేరే పార్టీల్లోకి వెళ్లిపోతారని భయం వెంటాడుతోంది. దీంతో లోకేశ్ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. అందువల్లే పొత్తుల కోసం ఆరాటపడుతున్నారు. పోనీ పవన్ కళ్యాణ్ను పూర్తిగా నమ్ముతాడా అంటే అదీ లేదు. కాపుల ఓట్ల కోసం పక్కన పెట్టుకున్నాడంతే. ప్రజల కోసమే కలిశామన్నప్పుడు పొత్తులో జనసేనకు కూడా సమాన స్థాయి ఇవ్వాలి. కానీ 24 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నాడు. వాటిలోనూ ఇంకొన్ని లాక్కొనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇవన్నీ మీకోసమేనని చెబితే ప్రజలు ఛీ కొడతారని 40 ఇయర్స్ ఇండస్ట్రికి తెలియక కాదు. కాకపోతే తానకు తాను ప్రపంచ మేధావిగా భావించి మాట్లాడేస్తుంటారు. అసలు ప్రజలతోనే నా పొత్తు అంటే ఈ తిప్పలన్నీ ఉండవు కదా బాబూ..
జగన్ను చూడు.. నీ కళ్ల ముందు పార్టీ పెట్టారు. ప్రజలనే నమ్ముకున్నారు. ఒంటరిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. మళ్లీ అదే పని చేస్తున్నారు. ఆయన్ను పిల్లోడని తిట్టే నీకు మాత్రం ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకుండా పోయింది. ప్రజల కోసం అనే పేరును అడ్డం పెట్టుకోవాల్సిన దుస్థితికి దిగజారాల్సి వచ్చింది.