రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో కూటమి పొత్తులు చిచ్చు పెడుతున్నాయి. 2014 నుంచి 2019 దాకా టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి, 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత టిడిపి పార్టీని వీడి బిజెపిలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికలు ముగిసిన ఒక నెలలోనే తెలుగుదేశం పార్టీనీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత 2019 జూలైలో పరిటాల శ్రీరామ్ ని ధర్మవరం టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు.
అప్పటినుంచి ధర్మవరం నియోజవర్గంలో టిడిపి నాయకులకు శ్రీరామ్ అండగా నిలిచాడు. పార్టీ తలపెట్టిన అన్ని కార్యక్రమాలు చురుగ్గా చేశాడు. అభ్యర్థిత్వం నీకే అంటూ ఓ వైపు నారా చంద్రబాబు నాయుడు మరోవైపు నారా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు. 2023 లో నారా లోకేష్ తలపెట్టిన యువగలానికి చిత్తూరు జిల్లాలో ప్రజా స్పందన కరువైన తర్వాత అనంతపురం జిల్లాలో అభాసుపాలు కాకుండా భారీగా జన సమీకరణ చేయటానికి ధర్మవరంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా కృషి చేశాడు శ్రీరామ్. బాబు, లోకేష్ ల మాటలు నమ్మిన శ్రీరామ్ టికెట్ తనకే వస్తుందంటూ గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ తిరిగాడు. తీరా ఎన్నికల సమయం దగ్గర పడేకొద్ది చంద్రబాబు టిడిపిలో సీనియర్ కుటుంబాలకి ఒకటే టికెట్ అంటూ ప్రచారానికి తెర లేపాడు,
మరోపక్క బిజెపి జనసేనలతో జతకట్టాడు. రెండు పార్టీలతో జతకట్టినప్పటికీ టికెట్ తనకే వస్తుంది అన్ని నమ్మకంతో ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేశాడు శ్రీరామ్ , చివరికి మొన్న ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నారా లోకేష్ తలపెట్టిన శంఖారావం సభలోను టికెట్ ఇస్తాను అని చెప్పాడు. ఇప్పుడు బిజెపితో పొత్తు కారణంగా ఆ టికెట్ ని బిజెపికి కేటాయిస్తున్నట్లు టీడీపీ అధిష్టానం శ్రీ రామ్ కు తెలిపారు. దీంతో ధర్మవరం సీటు బిజెపికి కేటాయించడంపై శ్రీరామ్ అనుచరులు టిడిపి అధినాయకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై మాట్లాడడానికి సత్య సాయి జిల్లా టిడిపి అధ్యక్షుడు బి.కె పార్థసారథి దగ్గరకు పరిటాల వర్గీయులు వెళ్లారు. ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు, దానికి స్పందిస్తూ పార్థసారథి ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఎట్టి పరిస్థితులను వరదపురం సూరికి సహకరించం అనే విషయాన్ని అధిష్టానానికి తెలియజేయాలని తెలుగుదేశం కార్యకర్తలు పార్థసారథితో తెలిపారు.