సినీ నటుడు విశాల్ సీఎం జగన్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్ళీ సీఎంగా జగన్ వస్తారని విశాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా విశాల్ నటించిన ‘రత్నం’ మూవీ ప్రచారంలో భాగంగా ఓ మీడియా విలేఖరి అడిగిన ప్రశ్నలకు పలు ఆసక్తికర సమాధానాలు విశాల్ ఇచ్చారు.
తాను వైసీపీకి కానీ ఏ పార్టీకి మద్దతు లేదంటూనే సీఎం జగన్ కి అభిమానినని వెల్లడించిన విశాల్ తిరిగి సీఎంగా జగన్ ఎన్నికయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు. సీఎం జగన్ పై జరిగిన దాడికి స్పందిస్తూ గతంలో ఆయన ఇలాంటి దాడులను ఎన్నో ఎదుర్కొన్నారని ఇలాంటి దాడులకు ఆయన భయపడరని పేర్కొన్నారు. కాగా గతంలోనూ సీఎం జగన్ కి అభిమానినని విశాల్ బహిరంగంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశాల్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి..
దర్శకుడు హరి, విశాల్ కాంబినేషన్లో మూడో చిత్రంగా రత్నం తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ చిత్రం ఏప్రిల్ 26న థియేటర్లలోకి రాబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన భరణి, పూజ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మూడో చిత్రంగా రాబోతున్న రత్నంపై ప్రేక్షకులకు అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో విశాల్ కి జోడిగా ప్రియ భవాని శంకర్ నటించగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.