విజయవాడలో సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు సమాచారం. సీఎం జగన్ పై రాళ్ళ దాడి ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ ఐదుగురిలో ఒకరు దాడికి పాల్పడినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తుంది. నేటి సాయంత్రం దాడికి పాల్పడ్డ నిందితులను పోలీసులు మీడియా ముందు హాజరు పరచనున్నారనే వార్తలు వస్తున్నాయి.
కాగా ఈ నెల 14వ తేదీన రాత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోఅజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ వద్ద మేమంతా సిద్ధం బస్సుయాత్రలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. సీఎం జగన్ ఎడమ కంటి పైభాగంలో గాయం కావడంతో రెండు కుట్లు పడ్డాయి. కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు 8 బృందాలుగా ఏర్పడి కీలక ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ ఫుటేజీలు, పబ్లిక్ తీసిన వీడియోలు, ఫోన్ కాల్ డేటాను పరిశీలించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అజిత్ సింగ్ నగర్ లో ఉండే సత్తి అనే వ్యక్తికి అతని స్నేహితులకు సీఎం జగన్పై దాడితో సంబంధం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని విచారించి కీలక విషయాలు రాబట్టారు. కాగా నేటి సాయంత్రం పోలీసులు నిందితులను మీడియా ముందు హాజరు పరచనున్నట్లు సమాచారం.