2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక, ప్రకటనల్లో మునిగి తేలుతున్నాయి, ఈ విషయంలో అధికార వైసీపీ మిగతా అన్ని పార్టీల కన్నా ముందుందని చెప్పొచ్చు. దాదాపు రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు విడతల వారీగా జాబితాలు విడుదల చేసింది. ఆయా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య ఉన్న సమస్యలు ఒకొకటి పరిష్కారం చేసుకుంటూ నియోజక వర్గాలలో సమన్వయకర్తలను నియమించుకుంటూ ముందుకు వెళ్తోన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా 10వ జాబితాను విడుదల చేసింది.
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును నియమిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది.ఇంతకు ముందు అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి అవనిగడ్డకు డాక్టర్ చంద్రశేఖరరావును సమన్వయకర్తగా ప్రకటించారు. డాక్టర్ చంద్రశేఖరరావు తన తనయుడు సింహాద్రి రామ్ చరణ్ కు అవకాశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిసి అడిగారు. అయితే మారుతున్న రాజకీయ సమీకరణల నేపథ్యంలో అవనిగడ్డ అసెంబ్లీ సెగ్మెంట్ కు రమేష్ బాబును , మచిలీపట్నం ఎంపీ సీటుకు చంద్రశేఖరరావును మార్పు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం జాబితాను విడుదల చేసింది.