25వేల కిలోల డ్రగ్స్ విశాఖ తీరంలో పట్టుబడటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. కాగా ఆ డ్రగ్స్ రాకెట్లో టీడీపీ నాయకులకున్న సంబంధాలు బయటపడటంతో పాటు నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు వస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నాయకులకు వివిధ కేసులలో పట్టుబడటం కొత్తేమి కాదు. గతంలో అనేక కేసుల్లో టీడీపీ నేతలు పట్టుబడటం గమనార్హం. ఇటీవల కాలంలో టీడీపీ నేతలు పట్టుబడిన కేసులను పరిశీలిద్దాం..
తెలుగు యువత గుంతకల్లు పట్టణ అధ్యక్షుడు బోయ రాము, అదే పార్టీకి చెందిన చంద్ర కర్ణాటక మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. చిత్తూరు జిల్లా పుత్తూరు తెలుగు యువత అధ్యక్షుడు హరికృష్ణ కారులో గంజాయి తరలిస్తూ పోలీసులకి దొరికిపోయాడు. నరసారావుపేట ములకలూరుకు చెందిన టీడీపీ నేత మద్దికూరి బ్రహ్మయ్య పేకాట శిబిరాలు నిర్వహిస్తూ పోలీసులకి పట్టుబడ్డాడు. టీడీపీ అమరావతి జేఏసీ నేత చిలకా బసవయ్యను వ్యభిచారం చేస్తున్న కారణంగా గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తైతే మనవరాలి వయసులో ఉన్న ఓ మైనర్ బాలికను విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ లైంగికంగా వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో విజయవాడ టీడీపీ నేత వినోద్ జైన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష వేసింది.
పెనమలూరు నియోజకవర్గ టీడీపీ నేత, రౌడీషీటర్ రెహమాన్ ను ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో బెదిరింపులకు పాల్పడినట్లు తేలడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. మోకా భాస్కరరావు హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన టిడిపి మహిళా నాయకురాలు మానుకొండ జాహ్నవిని తెలంగాణ పోలీసులు గంజాయి కేసులో అరెస్ట్ చేశారు. ఈమెను పార్టీ నుండి సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంది. ఏకంగా టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా కూనం కోటయ్య చౌదరి, కూనం వీరభద్రరావు చౌదరి డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. వీరు చంద్రబాబు వదిన పురందేశ్వరికి సమీప బంధువులు, వ్యాపార భాగస్వాములు కూడా ఉన్నారు. వీరికి టీడీపీతో కూడా సన్నిహిత సంభంధాలున్నాయి.
ఇలా ఎన్నో కేసుల్లో టీడీపీ నేతలు, ముఖ్య నాయకులు నిందితులుగా ఉన్నారు. కానీ ఆ కేసులన్నింటికీ తలమానికంగా లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాల పేర్లు బయటకు రావడం సంచలనమనే చెప్పాలి. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తున్న డ్రగ్స్ కేసులో చిక్కుముడులు వీడితే అసలైన నిందితులు ఎవరో బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి వేళ్లన్ని మాత్రం టీడీపీ నేతలవైపే చూపిస్తూ ఉండటంతో ఆ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేసిందని చెప్పవచ్చు..