గ్రూప్ వన్ ఆశావహులు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న శుభతరుణం వచ్చేసింది . గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు మధ్యాహ్నం ఆన్లైన్ లో విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం 2023 డిసెంబర్ 8వ తేదీన 81 గ్రూప్ వన్ జాబ్స్ తో కూడిన నోటిఫికేషన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1కి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్ టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు సూచించారు.
ఈ గ్రూప్ 1 కి సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 17వ తేదీన ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. ప్రిలిమినరీ పరీక్షకి సంబంధించి 17వ తేది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి పేపర్, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు రెండో పేపర్ కి సంబంధించిన పరీక్షలు నిర్వహించనున్నట్లు సంభంధిత అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల పరీక్షా కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు పేర్కొన్నారు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు నిర్ధేశిత సమయంలోపు చేరుకోవాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు కొంతకాలం ప్రభుత్వ శిక్షణ తరువాత RDO, RTO, DSP, డిప్యూటీ కలెక్టర్ , మున్సిపల్ కమీషనర్ , కమర్శియల్ టాక్స్ ఆఫీసర్, రిజిస్ట్రార్, ఇంకా పలు ప్రభుత్వ విభాగాల్లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగాలు లభించునున్నాయి.