2024 ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఓడిపోతే టీడీపీ కనుమరుగు కావడం ఖాయమన్న వ్యాఖ్యలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీ కొట్టడం అసాధ్యమని భావించి జనసేనతో జట్టుకట్టి కూటమిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అప్పటికీ ధైర్యం చాలక ఏపీలో ఒక్క శాతం ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు ఆ తర్వాత మౌనంగానే ఉండిపోయారు.
చంద్రబాబు మౌనం వెనుక ఉన్న అంతరార్ధం ఏంటో ఎవరికీ అంతుచిక్కలేదు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ఇష్టం లేదని నేను పొత్తు కోసం బ్రతిమిలాడానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బీజేపీ రాక కోసమే తొలిజాబితా ప్రకటించి అనగా టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తే జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించి 118 స్థానాలను మాత్రమే టీడీపీ జనసేన కూటమి ప్రకటించాయి. పొత్తులో బీజేపీ కూడా వస్తే మిగిలిన స్థానాలను ప్రకటించేలా టీడీపీ జనసేన ఉమ్మడిగా ప్లాన్ చేసుకోగా ఇప్పుడు బీజేపీ ఈ కూటమికి షాక్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబుతో పొత్తులో ఉండడం కంటే ఒంటరిగా పోటీకి దిగడమే మంచిదనే భావనలో బీజేపీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బీజేపీ జాతీయ నాయకుడు శివ ప్రకాష్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారని ఒక్కో అసెంబ్లీ స్థానానికి ముగ్గురు, పార్లమెంట్ స్థానానికి ఇద్దరి చొప్పున మొత్తం 525 మంది అభ్యర్థులను ఎంపిక చేసారని మరోసారి అభ్యర్థులను వడపోసి తుది జాబితా రూపొందించి బీజేపీ అధిష్టానానికి పంపారని సమాచారం.
కాగా బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన కూటమి తీవ్ర ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో, మేనిఫెస్టో రూపకల్పనలో బిజీ బిజీగా గడపడం చూస్తుంటే పొత్తు ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ మాత్రం పొత్తు విషయంలో నాన్చుడు ధోరణిలో ముందుకు సాగుతుంది. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ పెద్దలకు సుతరామూ ఇష్టం లేదని సమాచారం. బీజేపీ దాటవేత ధోరణి వల్ల టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల ప్రకటన ఆలస్యం అవుతూ వస్తుంది. దీనివల్ల ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామనే భావన టీడీపీ జనసేన నాయకుల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటుందా ఉండదా అనే సందేహాలకు బీజేపీ ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వొచ్చు.