విజయవాడ తెలుగుదేశం పార్టీకి చెందిన బుద్ధా వెంకన్న తనకు తాను అధినేత చంద్రబాబు నాయుడికి ఏకలవ్య శిష్యుడిగా చెప్పుకొంటుంటారు. అయితే అలాంటి వ్యక్తికే బాబు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వెంకన్న విజయవాడ పశ్చిమ సీటును చాలాకాలంగా అడుగుతున్నారు. అయితే నారా వారు జలీల్ఖాన్ను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు జనసేనకు చెందిన పోతిన మహేష్ పొత్తులో భాగంగా పశ్చిమ నీటు నాదేనని ప్రచారం చేసుకుంటున్నారు. దీని విషయంలో బెజవాడ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. కొద్దిరోజుల క్రితం బుద్ధా ర్యాలీ చేశారు. బాబుకు ఇవ్వబోయే అప్లికేషన్ అంటూ కనకదుర్గమ్మ పాదాల వద్ద పెట్టి నగరంలో బలప్రదర్శన చేశారు. ఒకవేళ పశ్చిమ నియోజకవర్గంలో అవకాశం ఇవ్వకపోతే అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని కోరారు. అయితే ఈ పార్లమెంట్ స్థానాన్ని సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు తన కొడుక్కి అడుగుతున్నారు. మరోవైపు జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. పవన్ అన్న నాగబాబు పోటీ చేయాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది. సేనాని సోదరుడు కాబట్టి చంద్రబాబు కాదనలేడు. దీంతో తన రాజకీయ భవిష్యత్ శూన్యమైపోతోందని భయపడిన వెంకన్న కొత్త ఎత్తుగడ వేసి ఆదివారం వినూత్న కార్యక్రమం నిర్వహించారు.
తన రక్తంతో గోడపై సీబీఎన్ జిందాబాద్.. నా ప్రాణమని రాశారు. బాబు ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసి మీడియా ముందు భజన అందుకున్నారు. ఆయన ఏమి మాట్లాడారంటే.. కొన్ని వాస్తవాలు బాబుకు తెలియాలనే ఈ కార్యక్రమం చేపట్టాను. కేశినేని నాని టీడీపీలో ఉన్నప్పుడు నన్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి తీసేయాలని వేరే వాళ్లకు సీటు ఇవ్వాలన్నాడు. బాబు నాకు విజయవాడ నగర అధ్యక్షుడి ఆరేళ్లు అవకాశం కల్పించారు. మూడు జిల్లాలకు ఇన్చార్జిగా నియమించారు. ఎమ్మెల్సీని చేశారు. పశ్చిమ నియోజకవర్గం తప్ప అన్ని స్థానాల్లో ఐవీఆర్ నిర్వహస్తున్నారు. పోటీ చేస్తానని గతంలోనే బాబు, లోకేశ్కు చెప్పా. చంద్రబాబు వెనుక అసెంబ్లీలో కూర్చోవాలని ఆశపడ్డా. సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయి. లాయల్టీగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రబాబు కుటుంబం తప్ప వేరే ఎవరు నాకు నాయకులు కాదు. పార్టీ కోసం నిలబడే వాళ్లకు అవకాశం ఇవ్వాలి. విజయవాడ వెస్ట్, లేదా అనకాపల్లి పార్లమెంట్ నుంచి అవకాశం ఇవ్వండి. నా రక్తంతో అధినేత కాళ్లు కడిగి ప్రేమ చూపించా. నా రక్తమంతా ఆయనే ఉన్నారు. నా గుండె కోసి ఆయన టేబుల్ మీద పెట్టగలను. పార్టీలో ఉండి విన్నా.. వినిపించుకోనట్లుగా నటించే ముగోళ్లు, చెవిటోళ్లు ఉన్నారు. బాబును వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తే ఒక్కరూ మాట్లాడరు. ఇది అభిమానమే.. బ్లాక్ మెయిలింగ్ కాదు. ఇక నా పనితీరు, స్వామి భక్తి ఎలా నిరూపించుకోవాలి?, సీటు ఇచ్చి చట్టసభల్లో అడుగు పెట్టించాలని కోరుతున్నా. ఇది నా విన్నపం మాత్రమే అన్నారు వెంకన్న.
వాస్తవానికి బుద్ధాకు టికెట్ ఇవ్వడం చంద్రబాబు ఇష్టం లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. విజయవాడ కాల్మనీ, సెక్స్ రాకెట్లో టీడీపీ నేతలే కీలకం. అందులోనూ వెంకన్నపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈయనకు టికెట్ ఇస్తే పార్టీ పరువు పోతుందని బాబు దూరం పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బుద్ధా రకరకాల నాటకాలు ఆడుతున్నారు. బాబును పొగుడుతూనే.. ఇంకోవైపు ఇన్డైరెర్ట్గా నీ కోసం చాలా చేశా.. సీటు ఇస్తావా? లేదా? అని ప్రశ్నించారు. మిగిలిన టీడీపీ నేతలను తిడుతూనే ఎంతో చేసిన నాకు ప్రాధాన్యం ఇవ్వరా అని అడిగారు. కాగా ఇదంతా షో అని జనసేన కొట్టిపారేస్తోంది. సీటు తమదేనని ఘంటాపథంగా చెబుతోంది. మరి రక్తంతో చేసిన అభిషేకం చూసేనా చంద్రబాబు మనసు కరిగి వెంకన్నకు అవకాశం కల్పిస్తారో.. ఇలాంటివి నా రాజకీయ జీవితంలో చాలా చూశానని లైట్ తీసుకుంటారో..