గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ముంబై జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో మోహిత్ శర్మ కీలకమైన రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.కాగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు రోహిత్ శర్మ క్లాస్ పీకడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాకుండా బుమ్రా, హార్దిక్ పాండ్య మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్లో రోహిత్ను మిడాన్లో ఫీల్డింగ్లో చేయమని హార్దిక్ ఆదేశించిన అనంతరం బౌలర్తో మాట్లాడిన తరువాత రోహిత్ను లాంగ్-ఆన్ పొజిషన్కు వెళ్లమని సూచించాడు. దీంతో రోహిత్ పరిగెత్తుకుంటూ లాంగ్ ఆన్కు వెళ్లాడు. ఇప్పటివరకూ వలయం లోపల మాత్రమే ఫీల్డింగ్ చేసే రోహిత్ హార్దిక్ నిర్ణయం వల్ల ఫీల్డింగ్ పొజిషన్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడం విశేషం.
రోహిత్ ఫీల్డ్ సెటప్ కంటే ముందే జస్ప్రీత్ బుమ్రాకి హార్దిక్ పాండ్యా మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హార్దిక్ పాండ్య చేసిన సూచనలు బుమ్రా పట్టించుకోకపోవడం హార్దిక్ కి కోపం తెప్పించింది. దీంతో బుమ్రా హార్దిక్ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. రోహిత్ శర్మ రావడంతో హార్దిక్ దూరంగా వెళ్లిపోయాడు.. దీంతో గొడవ సద్దుమణిగింది. ఓటమి అనంతరం రోహిత్ శర్మను వెనకనుండి హార్దిక్ పాండ్య హత్తుకొన్నాడు. కానీ రోహిత్ హార్దిక్ కౌగిలి నుండి విడిపించుకుని సీరియస్ గా క్లాస్ ఇచ్చినట్లున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కెప్టెన్ మార్పుతో ముంబై ఇండియన్స్ లో ఏర్పడ్డ విభేదాలు త్వరలోనే సమసిపోవాలని తిరిగి జట్టుగా సమిష్టిగా రాణించి విజయాల బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు..